రాజకీయ కక్ష కారణంగా నమోదైన క్రిమినల్ కేసును దర్యాప్తు చేసే సంస్థను మార్పు చేయడానికి వీల్లేదని భజన్లాల్ వర్సెస్ దేవీలాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. ఈ కేసులో సిట్ కీలక ఆధారాలను సేకరించింది. ఈ దశలో దర్యాప్తును కేంద్రం కనుసన్నల్లో ఉండే సీబీఐకి అప్పగిస్తే మొదటికే మోసం రావొచ్చు.
– హైకోర్టులో న్యాయవాది దవే
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుందని, ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం కొనసాగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని, చట్టసభలో ఓటింగ్ ద్వారా ప్రభుత్వ ఏర్పాటు జరగాలని రాజ్యాంగం ఘోషిస్తుంటే.. బీజేపీ తెర వెనుక కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలకు ఎర వేసి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు దొంగదారిని ఎంచుకున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర నిజంగానే అమలు జరిగి ఉంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ర్టానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. శాసనసభల్లో ప్రభుత్వాలకున్న మద్దతును తేల్చాల్సిన వ్యవహారాన్ని బీజేపీ తెరవెనుక ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలతో వెలకట్టి మార్చేందుకు ప్రయత్నించిందని చెప్పారు. నిందితులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించడం ద్వారా ప్రజాతీర్పును తుంగలోకి తొకే ప్రయత్నాలను పోలీసులు వల పన్ని బట్టబయలు చేశారని తెలిపారు. ఎటువంటి అభియోగం లేని దశలో, కనీసం సాక్షిగా కూడా లేకపోయినప్పటికీ బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ నమోదైన 12 గంటల్లోపే హైకోర్టులో రిట్ దాఖలు చేశారని గుర్తుచేశారు.
భజన్లాల్ దేవీలాల్ మధ్య రాజకీయ కక్ష కారణంగా నమోదైన క్రిమినల్ కేసును దర్యాప్తు చేసే సంస్థను మార్పు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఈ కేసులో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన నిందితులపై నమోదుచేసిన కేసును సీబీఐకి బది లీ చేస్తూ ఇచ్చిన తీర్పు చెల్లదని దవే చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో సిట్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారని, ఈ పరిస్థితుల్లో దర్యాప్తును కేంద్రం కనుసన్నల్లో ఉండే సీబీఐకి అప్పగిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, ఈ కేసులో బీజేపీ నేతలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల పార్టీ ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉన్న సీబీఐ.. మొయినాబాద్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరితే రూ.50 కోట్లు ఇప్పిస్తామని నిందితులు తమకు తాముగా వెల్లడించారని దవే చెప్పారు. అనేక కీలక విషయాలను సింగిల్ జడ్జి విస్మరించి తీర్పును వెలువరించారని, ఆ తీర్పును రద్దు చేయాలని కోరారు. క్రిమినల్ కేసు దర్యాప్తు సంస్థను మార్పు చేసే అసాధారణ పరిస్థితులు ఈ కేసులో లేవన్నారు. వ్యక్తిగత పక్షపాతం, దుర్మార్గమైన రీతిలో దర్యాప్తు అధికారి వ్యవహారం ఉంటే సింగిల్ జడ్జి జోక్యానికి వీలు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయని గుర్తుచేశారు. సీఎం మీడియా సమావేశంలో వాస్తవాలను మాత్రమే చెప్పారని, అప్పటికే పోలీసుల దర్యాప్తును నిలుపుదల చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. దర్యాప్తే ఆగిపోయినప్పుడు సీఎం మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయనే నిర్ణయానికి సింగిల్ జడ్జి రావడం సరికాదని చెప్పారు. సీఎం చెబితే పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదని తెలిపారు. అక్టోబర్ 26న ఘటన జరిగితే అదే నెల 29న హైకోర్టు పోలీసుల దర్యాప్తును నిలుపుదల చేసిందని అది నవంబర్ 9 వరకు అమలులో ఉన్నదని చెప్పారు. నవంబర్ 3న సీఎం మీడియా సమావేశం నిర్వహించారని చెప్పారు. సీఎం మీడియా సమావేశం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సీఎం మీడియా సమావేశం కారణంగా సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ ఇచ్చిన తీర్పు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
బీజేపీ నేతలు కేసులో నిందితులు కాకముందే ఎఫ్ఐఆర్ దాఖలైన 12 గంటల్లోపే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని దవే తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు అందరూ కేసు దర్యాప్తులో తలమునకలయ్యారని బీజేపీ ఎలా చెప్పగలదని ప్రశ్నించారు. అక్టోబర్ 27వ తేదీ నాటికే బీజేపీకి ఆ విషయాలు ఎలా తెలిశాయని నిలదీశారు. బీజేపీ చూపిన ధనబలాన్ని కోర్టులు విధిగా అడ్డుకోవాలని కోరారు. మనీ పవర్ను ఆదిలోనే తుంచేసి మ్యానిఫెస్టో ద్వారా ప్రజల మనసులను ఓట్ల ద్వారా గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ కూల్చివేతకు జరిగిన కుట్ర బాగోతాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రజా ప్రభుత్వాన్ని కాపాడటమే ప్రజాస్వామ్యమని చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదిస్తూ, దర్యాప్త అధికారిపై ఆరోపణలు లేనప్పుడు కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయడానికి వీల్లేదని అన్నారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.
పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశాక అక్టోబర్ 27, 29న రెండుసార్లు ఏసీబీ కోర్టుకు రిమాండ్ నివేదికను అధికారికంగా అందజేశారని దవే చెప్పారు. నవంబర్ 3 ఉదయం 11 గంటలకు హైకోర్టుకు అందజేశారని, ముగ్గురు నిందితులు ఫిర్యాదుదారుతో ఏం మాట్లాడిందీ యథాతథంగా ఆయా కోర్టులకు సమర్పించిన నివేదికల్లో ఉన్నాయని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించేందుకు కింది కోర్టు నిరాకరించడాన్ని సవాల్చేస్తూ సిట్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వివరాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో లేవని నిందితులు, బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. నిరాధార ఆరోపణలతో రాష్ట్ర పోలీసులను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారని, దీనిని ఆమోదిస్తూ సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయమన్నారు. దర్యాప్తు ఏకపక్షంగా ఉందంటే సరిపోదని, నిష్పక్షపాతంగా సిట్ లేదనే ఆరోపణలను బీజేపీ లేదా నిందితులు నిరూపించలేకపోయారన్నారు. పోలీస్ కమిషనర్ ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, మీడియా ప్రతినిధులు అడిగితే జవాబు చెప్పారని తెలిపారు.