హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే, పీవోపీ విగ్రహాల తయారీ, వాటి అమ్మకాలపై నిషేధం లేదని గుర్తు చేసింది. పీవోపీ విగ్రహాలపై నిషేధం లేనప్పుడు తాము ఎలాంటి ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందతో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టంచేసింది.
పీవోపీ విగ్రహాల తయారీని నిషేధిస్తూ సీపీసీబీ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గణేశ్మూర్తి కళాకార్ సంక్షేమ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. కొవిడ్ కారణంగా అమ్ముకోలేకపోయిన పీవోపీ విగ్రహాలను ఇప్పుడు అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వాలని మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వీటిపై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. హైదరాబాద్కు నదులు, సముద్రంతో అనుసంధానం లేకపోవడం వల్ల పీవోపీ విగ్రహాల నిమజ్జనంతో సమస్య వస్తున్నదని, అందువల్ల పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసే బేబీ పాండ్స్ (నీటి కుంటలు)ల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. అలాగే విగ్రహాల ఎత్తును నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.