Minister Srinivas Yadav | తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేటలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రి హరీశ్రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.
కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నామన్నారు. గతంలో 1.37లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మళ్లీ కొత్తగా 97వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిన సుదీర్ఘ పోరాటానికి నేటి పచ్చని తెలంగాణే సమాధానమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్నారు. ప్రజలు వాస్తవాలు గుర్తించాలన్నారు. గొల్ల కుర్మలు, మత్స్యకారుల అభివృద్ధిని తెలంగాణలో ఊహించామా? అన్నారు.
2014 ముందున్న గోసను నివారించామని, అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. ఇన్నేళ్లలో గత పాలకులు గొల్లకుర్మలు, రైతులు, మహిళల పాట్లు తీర్చారా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని, వారు కళ్లుండి చూడలేని కాబోదుల్లా మారారని విమర్శించారు. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల చివరిలో రెండో విడత గొర్ల పంపిణీ చేపడుతామని వివరించారు.