హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులు సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో సమరశంఖం పూరించారు. పాత పెన్షన్ ఇస్తామన్న పార్టీనే ఎన్నుకొంటామని ప్రతినబూనారు. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ సీం (ఎన్ఎంవోపీఎస్) ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ర్టాల సీపీఎస్ ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష, బహిరంగ సభను సోమవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ గ్రౌండ్లో నిర్వహించారు. కర్ణాటక సీపీయస్ యూనియన్ అధ్యక్షుడు శాంతారాం అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్, ఏపీ నుంచి రామాంజనేయులు, ఉత్తరప్రదేశ్ నుంచి విజయకుమార్ బంధు, ఉత్తరాఖండ్ నుంచి జిత్మని మైలులి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం అన్న నినాదంతో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చి, పాత పెన్షన్ ఇస్తామన్న పార్టీకే పట్టంగట్టామని తెలిపారు. కర్ణాటకలోనూ ఇదే తరహాలో పాత పెన్షన్ ఇచ్చే పార్టీకే అధికారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటకలో 4.4 లక్షల సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు, దాదాపు 30 లక్షల ఓటర్లు రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రభావితం చేయాలని కోరారు. దక్షణాది రాష్ర్టాల ఉద్యోగులంతా ఓల్డ్ పెన్షన్ ఇచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వాలని సూచించారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం నుంచి మల్లికార్జున్, దర్శన్గౌడ్, బాలస్వామి, చంద్రకాంత్, నాగరాజు, రఘువర్మ తదితరులు పాల్గొన్నారు.