హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. వికారాబాద్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మంజూరైన నాలుగో మెడికల్ కాలేజీ ఇది.
ఇప్పటికే కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నాయి.