Medical College | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగుపడింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి ఇచ్చింది. వంద మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కరీంనగర్ మెడికల్ కాలేజీకి అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించిన తెలంగాణ దేశ చరిత్రలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది.
ఈ ఏడాది నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్లో మెడికల్ కాలేజీలు ప్రారంభంకానుండగా.. విద్యార్థులకు 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి ఐదు మెడికల్ కాలేజీలు ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఈ సంఖ్యను 21కి పెంచింది. కొత్తగా 26 కాలేజీలు ఏర్పాటు చేయనుండగా.. రాష్ట్ర ప్రజలకు స్పెషాలిటీ సేవలు చేరువవ్వడంతో పాటు విద్యార్థులకు వైద్యవిద్య అందనున్నది. అయితే, కరీంనగర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి రావడంపై మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు.