హరారే : పసికూన ఐర్లాండ్తో పాటు పటిష్ట ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బలు తిన్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. ఈసారి ప్రత్యర్థి జింబాబ్వే. వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత పొట్టి ఫార్మాట్లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న టీమిండియా.. జింబాబ్వేతో జరుగబోయే మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం తొలి టీ20 ఆడనుంది. నాయకత్వ పగ్గాలు అందుకున్నాక ఇంకా విజయం రుచి చూడని అయ్యర్తో పాటు తమ ఆటతీరుతో తీవ్ర విమర్శల పాలవుతున్న జట్టుకూ ఈ సిరీస్ కీలకం కానున్న నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూ ఇకనైనా గెలుపుబాట పడుతుందా? అనేది ఆసక్తికరం.
మరోవైపు ఇటీవల కాలంలో అగ్రశ్రేణి జట్లకు సైతం షాకిస్తూ పునర్వైభవం దిశగా అడుగులేస్తున్న జింబాబ్వే.. ఐర్లాండ్ మాదిరిగానే భారత్కు షాకిచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. గంభీర్ గైర్హాజరీలో ఈ సిరీస్కు అయ్యర్ గ్యాంగ్కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. గత రెండు సిరీస్లలోనూ పవర్ ప్లేలోనే ప్రత్యర్థులకు వికెట్లను సమర్పించుకున్న బ్యాటింగ్ లైనప్ను గాడినపెట్టడానికి లక్ష్మణ్ ఎలాంటి ప్రణాళికలు అమలుచేస్తాడనేది ఆసక్తికరం. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే అభిషేక్ శర్మతో ‘వండర్ కిడ్’ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. ఇషాన్, శ్రేయస్, తిలక్తో పాటు మిడిలార్డర్లో రింకూ, దూబే ఉండటంతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. అయితే బ్లెస్సింగ్ ముజరబాని, ఎన్గరావ తమ పేస్తో భారత బ్యాటర్లను తిప్పలు పెట్టేందుకు సిద్ధమైన వేళ వీరిని టీమిండియా బ్యాటర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.