హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు అన్ని వైద్య కళాశాలలు, దవాఖానల యాజమాన్యాలు, డాక్టర్లు ఖాదీ వస్ర్తాలు వినియోగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కుటీర పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మందిని ఆదుకునేలా వాటి ఉత్పత్తులను వాడాలని కోరింది. వైద్య సిబ్బంది కోసం, దవాఖానల్లో వినియోగం కోసం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ప్రత్యేకంగా వస్ర్తాలు తయారు చేస్తున్నదని తెలిపింది.
డాక్టర్ల కోసం తెల్లకోటు, వైద్యసిబ్బంది కోసం ఆప్రన్లు, హాస్పిటళ్లలో వాడేందుకు బెడ్ షీట్లు, పిల్లోకవర్లు, కర్టెన్లు, పేషెంట్ల గౌన్లు, గ్రామాల్లో తయారుచేసే సబ్బులు, హ్యాండ్ వాష్, ఫినాయిల్ వంటివాటిని వినియోగించవచ్చని సూచించింది. ఖాదీ వస్ర్తాలు శరీరానికి చాలా మంచివని, పూర్తి పర్యావరణ హితమైనవని పేర్కొన్నది. ముఖ్యంగా డాక్టర్లు ఖాదీ కోటును ధరించాలని విజ్ఞప్తి చేసింది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని, గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో తోడ్పడాలని కోరింది.