హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఏకంగా 6.24 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఆ తర్వాత 3.26 లక్షల టన్నులతో నల్లగొండ రెండో స్థానంలో, 3.12 లక్షల టన్నులతో సిద్దిపేట మూడో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్నది. మొత్తం 6,584 కేంద్రాలకు 5,134 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ముగియడంతో అధికారులు వాటిని మూసివేశారు. 1,450 కేంద్రాల్లో స్వల్పంగా సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది రైతుల నుంచి 48 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని విలువ రూ.9,397 కోట్లు కావడం గమనార్హం. మరో 2 లక్షల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి రైతుకు సంబంధించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే మొత్తం ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించనున్నది.
కేంద్రం ఇబ్బంది పెట్టినా..
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. బాయిల్డ్ కొనుగోలు చేయబోమంటూ కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు సృష్టించింది. దీంతో రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చింది. రూ.3 వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించడానికి సిద్ధమైంది. కేంద్రం కాదన్నా.. యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణను ప్రారంభించింది. అప్పటికీ కేంద్రం కుట్రలు మాత్రం ఆగలేదు. అవసరమైన గన్నీ సంచులు మంజూరు చేయడంలోనూ ఇబ్బందులకు గురించి చేసింది. అయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా అవసమైన గన్నీ సంచులను సమకూర్చింది.
రైతుల ప్రయోజనమే మా ప్రాధాన్యం
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ధాన్యం సేకరణను విజయవంతంగా కొనసాగిస్తున్నాం. రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. కేంద్రం ఇబ్బంది పెట్టినప్పటికీ, ఆర్థికంగా రూ.3 వేల కోట్లు నష్టమైనా రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటినీ ఎదుర్కొని ధాన్యం కొనుగోలు చేస్తున్నది. మా ప్రభుత్వానికి రైతుల ప్రయోజనమే ప్రథమ ప్రాధాన్యం.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
టాప్-5 జిల్లాలు (టన్నుల్లో)
జిల్లా : కొనుగోలు ధాన్యం
నిజామాబాద్ : 6,42,894
నల్లగొండ : 3,26,859
సిద్దిపేట : 3,12,644
జగిత్యాల : 2,83,673
మెదక్ : 2,80,039