హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో మరొకరిని సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని భీంగల్లో సీఐడీ పోలీసులు గంటన్నరపాటు నిందితుడు సుభాష్ ఇంట్లో సోదాలు నిర్వహించి.. ల్యాప్టాప్, పలు నకిలీపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని సీఐడీ పోలీసులు విచారించడంతో నవీపేట ఎస్బీ ఇన్చార్జి ఏఎస్సై లక్ష్మణ్ వ్యవహారం బయటికొచ్చింది.
మంగళవారం తెల్లవారుజామున నిజామాబాద్లోని గంగాస్థాన్లో అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు.. విచారణ నిమిత్తం లక్ష్మణ్ను హైదరాబాద్కు తరలించారు. దీంతో భీంగల్ కేంద్రంగా లైసెన్స్లు లేని ట్రావెల్స్ నిర్వాహకుల్లో భయం మొదలైంది. గతంలో పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులే టార్గెట్గా నకిలీ పత్రాలను సృష్టించి, పాస్పోర్టులు ఇప్పించినట్టు విచారణలో తేలింది. లక్ష్మణ్ అరెస్ట్తో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు, పాస్పోర్టుల ఏజెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితులందరికీ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీ సమయంలో నిందితుల నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు.