MP Arvind | హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా.. కారు గుర్తుకు ఓటేసినా నేనే గెలుస్తా.. హస్తం గుర్తుకు ఓటేసినా నేనే గెలుస్తా..’ అంటూ ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అర్వింద్ వ్యాఖ్యలు బీజేపీ గెలుపుపై అనుమానం రేపుతున్నాయని ఇతర పార్టీల నాయకులు విమర్శించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్కుమార్గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, అర్వింద్ ఎన్నికల్ల్లో గెలిచేందుకు దొంగ దారులు వెతుక్కొంటున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తప్పుడు భావన కలుగుతుందని, ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదు, అర్వింద్ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపినట్టు చెప్పారు.
ఎంపీ అర్వింద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి జమాతే ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లాయక్ఖాన్ ఫిర్యాదు చేశారు. ఏ గుర్తుకు ఓటేసినా అది బీజేపీకే పడుతుందని ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అర్వింద్ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని మండిపడ్డారు. కాగా, అర్వింద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు చెందిన న్యాయవాదులు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణకు భంగం కలిగిస్తున్న ఎంపీ అర్వింద్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యక్తులకు పోటీచేసే అర్హత కూడా లేదని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ చేసిన అసభ్యకర పదజాలానికి సంబంధించిన వీడియోను ఎన్నికల సంఘానికి అందించామని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జీ కిరణ్కుమార్, నరేందర్, లక్ష్మణ్ ఉన్నారు.