హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను గురువారం విడుదల చేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు జరిగిందని వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రూ .11వేల కోట్లు జమ చేశామన్నారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తై మూసివేసామని తెలిపారు. నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల నుంచి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీని విలువ 12,051 కోట్లు ఉంటుందన్నారు.
ఇప్పటివరకూ అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు, నల్గొండలో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా అత్యల్పంగా అదిలాబాద్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొనసాగుతుందన్నారు.