హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా, సజావుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10.40 లక్షల మంది రైతుల నుంచి 59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.12,051 కోట్లని చెప్పారు. ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6 లక్షల టన్ను ల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. కామారెడ్డిలో 5 లక్షల టన్నులు, నల్లగొండలో 4 లక్షల టన్నులు సేకరించగా.. అత్యల్పంగా అదిలాబాద్, జోగులాంబ గద్వాల రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లు జరిపినట్టు వెల్లడించారు.