కామారెడ్డి, జూలై 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోమని, నాలుక చీరేస్తామని నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని హెచ్చరించారు. స్పీకర్ పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో భాస్కర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సభాపతి రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారని తెలిపారు. రైతులకు వ్యతిరేంగా మాట్లాడినా, స్పీకర్ నోరు మూసుకొని కూర్చోవాలా? అని ప్రశ్నించారు. 125 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక చిల్లర దొంగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం ఆ పార్టీ దౌర్భాగ్యమని భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు బూట్లు నాకి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయిన రేవంత్రెడ్డి, పదవుల కోసం యనమల రామకృష్ణుడి కాళ్లకు బూట్లు తొడిగాడని, ఆ నాటి చిత్రాలను భాస్కర్రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. అసలు లోక్సభ నుంచి రేవంత్రెడ్డిని బహిష్కరించాలని బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరఫున లోక్ సభ స్పీకర్కు త్వరలో తాము లేఖ రాస్తామని తెలిపారు. ఇలాంటి వారితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతమని జోస్యం చెప్పారు.