MP Arvind | ఖలీల్వాడి, జూలై 31: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్ ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ‘అర్వింద్ నుంచి పార్టీని కాపాడాలి’, ‘సేవ్ బీజేపీ’, ‘అర్వింద్ ఒంటెత్తు పోకడలు నశించాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్వింద్ తీరును నిరసిస్తూ ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయినా అధిష్ఠానం పట్టించుకోకపోవడం, అర్వింద్ తీరును చేష్టలుడిగి చూడటాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయానికి తరలివచ్చి, బైఠాయించారు. అర్వింద్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో అర్వింద్ను బొంద పెడతాం
ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అర్వింద్ను వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. అర్వింద్ కన్నా తామే బీజేపీలో సీనియర్లమని, అర్వింద్ తన స్వార్థం కోసం తన తండ్రి మాటున కాంగ్రెస్ జెండాలు మోసి 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చాడని గుర్తుచేశారు. ఆయన గెలుపులో తమ పాత్రా ఉన్నదని.. ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అర్వింద్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.