నిజామాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ నెల రోజులుగా పోరాటం చేస్తున్నదని, వారం రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో తమ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. పార్లమెంటులో టీఆర్ఎస్ పోరాడుతున్నా బీజేపీ ఎంపీలు అర్వింద్, బండి సంజయ్లు తెలంగాణ రైతులకు మేలు చేయలేని దద్దమ్మలుగా మిగిలారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన నిజామాబాద్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. అర్వింద్, బండి సంజయ్లు ఎంపీలు కాదా? అని ప్రశ్నించా రు. తెలంగాణ వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో పార్లమెంటులో అడుగొచ్చు కదా? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణ విషయంలో చేతులెత్తేసినందున వచ్చే సీజన్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండదన్నా రు. తెలంగాణలో రైతులు తుకాలు వేస్తున్నారు.. ఏ వడ్లు తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే మార్చి నెలలో చెప్తామనడం బాధాకరమన్నారు. అప్పటివరకు తుకాలు వేయకుండా ఆగాల్నా అం టూ ప్రశ్నించారు. బీజేపీ సర్కారుకు ప్రజలు, రైతుల బాధలు, కన్నీళ్లు పట్టవని మండిపడ్డారు. రైతులు చనిపోయినా రాజకీయమే కావాలా?, కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వం ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమన్నారు.
గత యాసంగిలో 50 లక్షల టన్నులు బియ్యంగా తీసుకుంటామని చెప్పిన కేంద్రం.. ఇచ్చిన మాటను విస్మరించి కేవలం 24 లక్షల టన్నులు సేకరించిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మిగిలిన 26 లక్షల టన్నులు మర ఆడించిన బియ్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీస్తే వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ వద్దంటూ బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నదన్నారు. లిఖిత పూర్వక హామీ పేరుతో బీజేపీ ప్రభుత్వం నాటకాలు చేస్తూ, రైతులను బలి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేసినా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం బాయిల్డ్ రైస్ తీసుకునేది లేదని చెప్పడం బాధాకరమన్నారు. రైతులకు నిబంధనలు విధిస్తూ పాలన సాగిస్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అన్యాయపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రైతులే లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని, రైతులే లేకపోతే మోదీ సర్కారే ఉండదని ఆయన హెచ్చరించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటోడు కూడా కేంద్రాన్ని ఏమీ అడగడం లేదని మంత్రి దుయ్యబట్టారు.