Nizam Sugars | బోధన్, అక్టోబర్ 19: నిజాం షుగర్స్.. ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద చక్కెర తయారీ కర్మాగారం. అంతేకాదు.. నిజాం షుగర్స్ అంటే తెలంగాణ వారసత్వ సంపద. ఇంతటి గొప్ప వైభవాన్ని కలిగిన ఈ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టి.. నష్టాల ఊబిలోకి లాగి.. చివరకు ఆ సంస్థ మనుగడనే దెబ్బతీసిన పాపం మాత్రం కాంగ్రెస్దే. 1937 ఏప్రిల్లో బోధన్ కేంద్రంగా ప్రారంభమైన నిజాం షుగర్స్కు సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తమ అరాచక విధానాలతో దుర్గతిని పట్టించారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ పాలకులు పోటీపడి ఈ సంస్థను నాశనం చేశారు మరి. 2002లో టీడీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి చ్రందబాబు నాయుడు ఈ ఫ్యాక్టరీని జాయింట్ వెంచర్ పేరిట డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్కు అప్పగించారు. అప్పట్నుంచి ఫ్యాక్టరీకి కష్టాలు మొదలయ్యాయి. నష్టాలు పెరిగిపోయాయి. ఈ ప్రైవేటీకరణను నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకపోయింది. చంద్రబాబు తన సొంత ఆస్తిలా ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ చెరుకు రైతులు, కార్మికులు పోరాటానికి దిగారు. దీనికి సైతం నాటి కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవలేదు. అయితే అప్పుడప్పుడే ఊపిరి పోసుకుంటున్న టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్).. కార్మికులు, కర్షకులకు అండగా నిలబడింది.
అధికారంలో ఉన్నా..
2004లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పాలకులు ఈ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా ప్రైవేట్ యాజమాన్యానికే కొమ్ముకాశారు. ఇక నిజాం షుగర్స్ను హస్తగతం చేసుకున్న డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్ అధినేత గోకరాజు గంగరాజు.. ఈ ఫ్యాక్టరీ భూములు, ఇతర ఆస్తుల్ని చూపించి వివిధ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలను రుణాలుగా పొందారు. చివరికి ఓ అర్ధరాత్రి నిజాం షుగర్స్ను మూసేయడంతో కార్మికులంతా రోడ్డునపడ్డారు. మరోపక్క చెరుకు రైతుల బకాయిలనూ ఎగ్గొట్టారు. చంద్రబాబు ఫ్యాక్టరీని అమ్మేస్తే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఫ్యాక్టరీని తిరిగి స్వాధీనం చేసుకోకుండా మీనమేషాలు లెక్కించారు.
ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం
2015 డిసెంబర్ 22న అర్ధరాత్రి వేళ నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం లాకౌట్ను విధించింది. దీంతో ఒక్కసారిగా కార్మికులు, చెరుకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ దశలో సీఎం కేసీఆర్ రైతులు, కార్మికులకు అండగా నిలబడ్డారు. ప్రైవేట్ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా చేతులెత్తేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 66 కోట్ల రూపాయలను చెల్లించింది. బకాయిల విషయాన్ని అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, నాటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం కూడా కలిసొచ్చింది. కాగా, నిజాం షుగర్స్ను చేజిక్కించుకుని, దాన్ని అర్ధాంతరంగా మూసేసిన గోకరాజు గంగరాజు బీజేపీ నాయకుడు కావడం గమనార్హం. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ అన్యాయంపై మాత్రం బీజేపీ నాయకులు మాట్లాడిన సందర్భం లేదు.
ప్రైవేటీకరణ ఇలా..
1937 ఏప్రిల్ 17న నాటి నిజాం నవాబు బోధన్లో ఈ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించారు. లాభసాటిగా ఉండటంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలోనూ అనేక చక్కెర ఫ్యాక్టరీలను తెరిచారు. అయితే సీమాంధ్ర పాలకుల పుణ్యామాని నిజాం షుగర్స్పై క్రమంగా నీలినీడలు కమ్ముకున్నాయి. హిందూపూర్, మిర్యాలగూడ, లచ్చాయిపేట్ల్లోని ఫ్యాక్టరీలను అయినకాడికి అమ్మేశారు. అంతటితో ఆగకుండా శక్కర్నగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లను, శక్కర్నగర్లోనే ఉన్న ఆల్కహాల్ డిస్టిల్లరీనీ నాటి సీఎం చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. లాభాలను గడిస్తున్న ఈ ఫ్యాక్టరీలను ప్రైవేట్పరం చేయడాన్ని చెరుకు రైతులు, కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. టీఆర్ఎస్ సైతం ఈ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నది. అయినప్పటికీ డెల్టా పేపర్ మిల్స్కు నిజాం షుగర్స్ను జాయింట్ వెంచర్ పేరిట చంద్రబాబు కట్టబెట్టారు. 51 శాతం వాటా ప్రైవేట్ యాజమాన్యానిదైతే రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం. దీంతో నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఏర్పడింది.
సభా సంఘం నివేదిక బుట్టదాఖలు
2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో అక్రమాలపై విచారణ కోసం శాసన సభా సంఘాన్ని నియమించింది. దీన్నికూడా టీఆర్ఎస్ ఒత్తిడితోనే తెచ్చారు. ఈ సభా సంఘం 2006లో సమర్పించిన తమ నివేదికలో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ అక్రమమని, ఇందుకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఫ్యాక్టరీని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సిఫార్సులు చేసింది. అయితే కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర విభజన వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా.. ప్రైవేట్ యాజమాన్యానికి వత్తాసుగా నిలబడ్డారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. దీంతో సభా సంఘం నివేదిక బుట్టదాఖలైనైట్టెంది.
తెలంగాణ వచ్చాక..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం.. నిజాం షుగర్స్ను పునరుద్ధరించి, పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేసింది. తిరిగి రైతులకు ఫ్యాక్టరీని అప్పగించేందుకు అన్నివిధాలా ప్రయత్నించింది. నిజాం షుగర్స్ స్వాధీనం, దాన్ని సహకార పద్ధతిలో రైతులకు అప్పగించడం కోసం 2015 ఏప్రిల్ 29న జీవోఎంఎస్ 28ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో నిజాం షుగర్స్ను డెల్టా పేపర్ మిల్స్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకోవడం, ఇందుకుగాను నిజాం షుగర్స్ యూనిట్ల ఆస్తులను మదింపు చేయడం, ప్రైవేట్ యాజమాన్యం బీఐఎఫ్ఆర్కు వెళ్లే పరిస్థితులను అడ్డుకోవడం, సంస్థ బలోపేతానికి సూచనల కోసం కార్యదర్శుల కమిటీ వంటి నిర్ణయాలున్నాయి. చక్కెర ఫ్యాక్టరీల నిర్వహణ, చెరుకులో అధిక దిగుబడుల సాధనపై రైతులకు అవగాహన కల్పించేందుకూ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. రైతులు నష్టపోకుండా ఆదుకున్నది.
న్యాయ పోరాటం..
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నిజాం డెక్కన్ షుగర్స్ యాజమాన్యం.. 2016లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ను దాఖలు చేసింది. అయితే కంపెనీకి అనుగుణంగా తీర్పు రాగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిజాం షుగర్స్ భూములు, ఆస్తులను రక్షించాలన్న తపనతో ఢిల్లీలోని ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యూనల్)కు వెళ్లింది. ప్రైవేట్ యాజమాన్యం లాభాలను అనుభవించిందని, తెలంగాణలో సంస్థకున్న విలువైన భూములను అప్పుల కింద అమ్మేందుకు కుట్ర చేస్తోందని వాదించింది. దీంతో కంపెనీకి వ్యతిరేకంగా 2019లో తీర్పు వచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు ఎన్డీఎస్ఎల్ వెళ్లింది. ఇది నిజాం షుగర్స్ పునరుద్ధరణ ప్రక్రియకు సాంకేతిక అడ్డంకిగా మారింది.
కాంగ్రెస్ వల్లే ఇదంతా..
నిజాం షుగర్స్ బోధన్, మెట్పల్లి, మెదక్ యూనిట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరుకు రైతులమంతా ఆందోళనలు చేశాం. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 2002లో ఈ ఫ్యాక్టరీలను ప్రైవేట్పరం చేశారు. దీంతో చెరుకు రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సభా సంఘాన్ని నియమించింది. నిజాం షుగర్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నాడు సభా సంఘం స్పష్టంగా సిఫార్సు చేసింది. అయినప్పటికీ ఆ సిఫార్సును కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్టరీ పూర్తిగా నాశనమైంది.
-కేపీ శ్రీనివాస్ రెడ్డి, చెరుకు రైతుల నాయకుడు, బోధన్
తగ్గిన చెరుకు సాగు
నిజాం షుగర్స్ పునరుద్ధరణకు గణనీయంగా తగ్గిపోయిన చెరుకు సాగు.. మరో పెద్ద అడ్డంకిగా మారింది. రైతులు క్రమంగా చెరుకు సాగును వదులుకుంటున్నారు. దీంతో ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు 6 లక్షల నుంచి 50 వేల టన్నులకు పడిపోయింది. ఒకవేళ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగినా చెరుకును రైతులు మళ్లీ సాగు చేస్తారా? అన్న నమ్మకం లేదు. నిజాం షుగర్స్ మూడు యూనిట్లు పూర్తి సామర్థ్యం మేరకు నడవాలంటే 10 లక్షల టన్నుల చెరుకు అవసరం. సరిపడా పంట రాకపోతే నష్టాలు తప్పవు.
మాట్లాడే అర్హత ఆ పార్టీలకు లేదు..
నిజాం షుగర్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఎంతగానో పోరాడారు. వారికి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఏనాడూ మద్దతివ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నిజాం షుగర్స్కు మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారు. అయితే ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యం ట్రిబ్యూనల్స్లో కేసులు వేసింది. దీంతో కర్మాగారం పునరుద్ధరణకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడం శోచనీయం. ఎవరైతే ఫ్యాక్టరీకి ఈ దుస్థితిని తెచ్చారో.. వారే ఇప్పుడు ఫ్యాక్టరీ గురించి బాధపడుతుండటం విచిత్రంగా ఉన్నది. దయచేసి నిజాం షుగర్స్ను రాజకీయాల కోసం వాడుకోవడం మానేయాలని కాంగ్రెస్, బీజేపీలను కోరుతున్నా..
-రవిశంకర్ గౌడ్, నిజాం షుగర్స్ కార్మిక నాయకుడు, బోధన్