(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): గడిచిన పది నెలల్లో ఏకంగా రూ.లక్ష కోట్ల పైచిలుకు ప్రాజెక్టులను గుజరాత్కు కట్టబెట్టిన ప్రధాని మోదీ.. ఆదివారం రూ. 22 వేల కోట్ల విలువైన టాటా-ఎయిర్బస్ సీ-295 మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత ఈ ప్రాజెక్టును మహారాష్ట్రలోని నాగపూర్లో స్థాపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, మరికొద్ది రోజుల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడం కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ద్వయం ఈ ప్రాజెక్టును గుజరాత్లోని వడోదరాకు తరలించుకుపోయారు. వడోదరలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు కేంద్రప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. అయితే, అంతకు మూడు వారాల ముందే అంటే ఈ నెల 7న ఈ ప్రాజెక్టు విషయమై కేంద్రమంత్రి, నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు ఓ లేఖ రాసినట్టు తాజాగా బయటపడటం చర్చనీయాంశంగా మారింది.
లేఖలో ఏం రాశారంటే?
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు గడ్కరీ రాసిన లేఖలో.. ‘నాగపూర్లో మహారాష్ట్ర ప్రభుత్వం మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ హబ్ ఎయిర్పోర్ట్ ఎట్ నాగపూర్ (మిహాన్)లో సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కంపెనీలను విస్తరించడానికి టాటా గ్రూప్నకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం, భూములు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి’ అని గడ్కరీ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘టాటా గ్రూప్ కంపెనీలైన టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇండస్ట్రీస్, బిగ్ బాస్కెట్తో పాటు కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులకు ఈ నగరం ఎంతో అనువైనది. ఎయిరిండియా, విస్తారా, ఎయిర్ఏషియా సేవలకు, నైట్ పార్కింగ్కు నాగపూర్ ఎయిర్పోర్ట్ను కేంద్రంగా చేసుకోవడం లాభసాటిగా ఉంటుంది. ఏవియేషన్ స్పేర్స్, పెద్దమొత్తంలో విమాన మరమ్మతు యూనిట్ల నిర్మాణానికే గాకుండా ఐటీ, ఐటీఈఎస్, ఆతిథ్యరంగంలో పెట్టుబడులకు నాగపూర్ ఎంతో ప్రయోజనకరం’ అని తెలిపారు.
మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టును నాగపూర్లో ప్రారంభిస్తే, టాటా గ్రూప్నకు తాను పూర్తి సహకారం అందిస్తానని, విదర్భ ఎకనమిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రతినిధులు త్వరలోనే మిమ్మల్ని (చంద్రశేఖరన్) కలుస్తారని గడ్కరీ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, టాటా ప్రాజెక్టు మహారాష్ట్ర నుంచి తరలిపోకుండా గడ్కరీ ఎంత ప్రయత్నించినా.. గుజరాత్కు తరలిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ టాటా ప్రాజెక్టును గుజరాత్కు కట్టబెట్టారని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాగా, మోదీ సర్కారు పాలనపై గడ్కరీ ఇటీవల పలుమార్లు అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే.