కరీంనగర్ : దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై నీతి అయోగ్ కమిటీ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. విశ్వనాథ్ బిష్ణయ్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం.. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో పర్యటించింది. ఈ సందర్భంగా దళితబంధు లబ్దిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను నీతి అయోగ్ బృందం పరిశీలించింది. అనంతరం దళితుల అభిప్రాయాలను తెలుసుకుంది. హుజరాబాద్ పట్టణంలోని కనికుంట్ల కళ పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ను, బత్తుల అభిలాష, మ్యాకల సుశీల ఎంబ్రాయిడరీ మిషన్ యూనిట్ను, వేల్పుల శారద, కొనకోటి నవ్య నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ యూనిట్లను నీతి అయోగ్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా నీతి అయోగ్ సభ్యులు మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళితులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం శుభ పరిణామం అని పేర్కొన్నది. పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పించేందుకు, దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంలో ఈ పథకం ఉపయోగపడుతుందని నీతి అయోగ్ బృంద సభ్యులు పేర్కొన్నారు. సమాజంలో దళితులు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దళితులకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఈ పథకం చాలా బాగుందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు కుమార్ జైన్, నిఖిత జాయిన్, యశస్విన్ సరస్వతి, ఇరామయీ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సురేష్, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.