హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ పనితీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ చేసిన సునిశిత విమర్శలకు గంటన్నరలోనే ఆ సంస్థ ఆగమేఘాలమీద స్పందించింది. కానీ, సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేక అభాసుపాలైంది. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల కు కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వలేదన్న సీఎం ప్రశ్నకు ఆ సంస్థ వద్ద సమాధానమే లేదు. డొంకతిరుగుడు వాదనతో ఓ ప్రకటన విడుదలచేసి పరువు తీసుకొన్నది. జల్ జీవ న్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు మంజూరు చేస్తే, రూ.200 కోట్లు మాత్రమే వాడుకొన్నదని మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది.
వాస్తవాలు ఒప్పుకొన్న నీతి ఆయోగ్
కేంద్ర ప్రాయోజిత పథకాలైన పీఎంకేఎస్వై, ఏఐబీపీ, సీఏడీడబ్ల్యూఎం కింద 2014 – 2021 వరకు రూ.1,195 కోట్లు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ పేరొన్నది. 14వ ఆర్థిక సం ఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచామని, 2015-16లో కేంద్ర పథకాల కింద రూ. 2,03,740 కోట్లు, 2022-23లో రూ.4,42,781 కోట్లు ఇచ్చినట్టు చెప్పుకొన్నది. ఈ స్థాయిలో నిధు లు పెరిగినా తెలంగాణకు వచ్చింది రూ.4 వేల కోట్ల లోపేనని నీతి ఆయోగ్ ప్రకటనతోనే తేలిపోయింది. మరి మిగతా నిధులు ఏ రా ష్ట్రాలకు, ఎంతెంత వెళ్లినట్టు? ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయింది? అంటే సీఎం కేసీఆర్ చేప్పినదాంట్లో వాస్తవం ఉన్నదని అం గీకరించినట్టే కదా? రాష్ట్రాలకు కేంద్రం ఇస్తు న్న నిధులు రెట్టింపు అయ్యాయని నీతి ఆయోగ్ గొప్పగా చెప్పింది. కానీ అదే సమయంలో కేంద్ర బడ్జెట్ 17.94 లక్షల కోట్ల నుంచి 39.44 లక్షల కోట్లకు పెరిగిన విషయా న్ని ఎందుకు విస్మరించింది? కేంద్ర బడ్జెట్ రెట్టింపైతే రాష్ట్రాల వాటా పెరగాలి కదా? కేంద్ర పథకాల కోసం రాష్ట్రాలకు లక్షల కోట్లు ఇస్తున్నప్పుడు తెలంగాణకు ఏడేండ్లలో రూ.1,195 కోట్లే ఎందుకు కేటాయించింది? రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా ను ఎగ్గొట్టేందుకు సెస్ల రూపంలో భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకొంటూ రాష్ట్రాలను మోసం చేస్తున్నదన్న కేసీఆర్ ఆరోపణపై నీతి ఆయోగ్ సమాధానం ఏమిటి?