కరీంనగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్నదని మెచ్చుకొన్నారు. విశ్వనాథ్ బిష్ణ్ణోయ్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం సభ్యులు కుమార్ జైన్, నిఖిత జైన్, యశస్విన్ సరస్వతి, ఇరామయీ శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో పర్యటించారు. దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలించి వారితో మాట్లాడారు. పేపర్ ప్లేట్ మేకింగ్ యూనిట్ను స్థాపించిన కనికుంట్ల కళ, ఎంబ్రాయిడరీ మెషిన్ యూనిట్ స్థాపించిన బత్తుల అభిలాష, మ్యాకల సుశీల, నాన్ ఊవెన్ బ్యాగ్స్ తయారీ యూనిట్ నెలకొల్పిన వేల్పుల శారద, కొనకోటి నవ్యతో నీతి ఆయోగ్ సభ్యులు మాట్లాడారు. వారు ఏర్పాటు చేసిన యూనిట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దళితబంధు పథకం ఎంతో బాగున్నదని ప్రశంసించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, ఎలాంటి వడ్డీ లేకుండా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి డీ సురేశ్ నీతి ఆయోగ్ బృందం సభ్యులకు వివరించారు. నేరుగా ప్రభుత్వమే దళితులకు ఉపాధి కల్పిస్తున్న విధానం బాగున్నదని ఆయోగ్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. దళిత సమాజం వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నదని అభిప్రాయపడ్డారు. సమాజంలో దళితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దళితులకు ఆర్థిక చేయూతకు అమలు చేస్తున్న ఈ పథకం చాలా బాగున్నదని వారు పేర్కొన్నారు.
నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారా?
పేపర్ మేకింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన లబ్ధిదారు కనికుంట్ల కళ నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్జిస్తుండటంతో నీతి ఆయోగ్ సభ్యులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికి ఇంతకన్నా ఏమి కావాలన్నారు. ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు వారు అభినందనలు తెలిపారు. హుజూరాబాద్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఎంతో చక్కగా, పద్ధతిగా అమలు చేస్తున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అధికారుల బృందాన్ని కూడా వారు ప్రశంసించారు.
వెరీ గుడ్ అన్నరు
నీతి ఆయోగ్ సభ్యులు మా ఎ్రంబాయిడరీ షాపును పరిశీలించి వెరీగుడ్ అన్నరు. ఖర్చులు పోను నెలకు రూ.40 వేలు మిగులుతున్నాయని, ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతున్నదని మరో రూ.20 వేలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పిన. ఎంబ్రాయిడరీ మెషిన్కు రూ.22 లక్షలు పెట్టుబడి అయిందని, ఇద్దరం కలిసి రెండు యూనిట్లు పెట్టుకున్నట్టు చెప్తే వారు విని పరేషాన్ అయిండ్రు. నయా పైసా ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఇవ్వడం ఎన్నటికీ మరిచిపోను. ఆర్థికంగా ఎదిగి ఆయన పేరు నిలబెడుతా.
– బత్తుల అభిలాష్, రాజా డిజైనర్
మనస్ఫూర్తిగా అభినందించిన్రు
నాన్ ఊవెన్ బ్యాగుల తయారీ మెషిన్లతో ఉపాధి పొందుతున్న తీరును చూసి నీతి ఆయోగ్ అధికారులు మనస్ఫూర్తిగా అభినందించిన్రు. మెషిన్లకు మొత్తం పెట్టుబడి ఎంత అయిందని అడుగగా.. రూ.30 లక్షల వరకు ఖర్చు అయిందని, మరొకరితో కలిసి ఈ బ్యాగుల తయారీ మెషిన్ కొన్నట్టు చెప్పిన. బ్యాగుల తయారీకి ఎంత మంది పనిచేస్తున్నారని అడిగితే.. నాతో పాటు మరో ఐదుగురు పనిచేస్తున్నారని చెప్పడంతో వారు మెచ్చుకున్నరు.
– వేల్పుల శారద, నాన్ ఊవెన్ బ్యాగుల తయారీ వ్యాపారి