వరంగల్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుత ప్రగతి సాధ్యమని నీతి ఆయోగ్ సభ్యుడు పద్మభూషణ్ విజయ్కుమార్ సారస్వత్ అభిప్రాయపడ్డారు. మారుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎలాంటి టెక్నాలజీని అయినా మంచి కోసమే వినియోగించాలని, వినాశనానికి, మోసానికి తగదని హితవు పలికారు. వరంగల్ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాన్వొకేషన్లో పాల్గొనేందుకు శనివారం వరంగల్ నగరానికి వచ్చిన విజయ్కుమార్ సారస్వత్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. చంద్రయాన్తో అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకొన్న విద్యార్థులు దేశానికి మార్గదర్శకులు అని, ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తున్నది. దీని వినియోగంపై మీ విశ్లేషణ ఏమిటి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుత టెక్నాలజీ. అన్నిరంగాల్లోనూ దీన్ని వాడుకోవాలి. రోజువారీ అవసరాలతోపాటు రక్షణ రంగంలోనూ ఏఐని ఉపయోగించుకోవాలి. సైనిక వాహనాలు, ఆయుధాల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యం పెంచడం మంచిదే. ఇప్పటికే మానవ రహిత సైనిక పరికరాలు, యంత్రాల వినియోగం పెరుగుతున్నది. ఈ ప్రక్రియలో ఏఐ చక్కగా ఉపయోగపడుతుంది. డ్రోన్ నిర్వహణలోనూ ఈ టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాలి.
చంద్రయాన్ విజయం, ఆదిత్య ప్రయోగాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
చంద్రయాన్ విజయం మనదేశానికి గొప్ప స్ఫూర్తిని నింపింది. ఆదిత్య ప్రయోగం విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉన్నది. ఈ ప్రయోగాలు దేశాన్ని సాంకేతికపరంగా ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకొని కొత్త శకం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో అనేక రంగాల్లో కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
ఇటీవలి జీ-20 సమ్మేళనంతో దేశానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయి?
జీ-20 సదస్సుతో అంతర్జాతీయంగా మనదేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో మన దేశానికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. సదస్సులో పాల్గొన్న అన్ని దేశాలతో భారత దౌత్య, వాణిజ్య, ఇతర సంబంధాలు పటిష్ఠంగా ఉంటాయి. ఈ ప్రక్రియ మున్ముందు సత్ఫలితాలను ఇస్తుంది.
వరంగల్ నిట్పై మీ అభిప్రాయం చెప్పండి?
వరంగల్ నగరంలో ఆర్ఈసీగా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు నిట్గా అభివృద్ధి చెందింది. దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్నది. అకాడమిక్, రిసెర్చ్ విషయంలో ఇది విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్నది. ఇక్కడ చదివిన విద్యార్థులు గొప్ప టెక్నీషియన్స్ అయ్యారు. వారి పరిశోధనలు దేశానికి బాగా ఉపయోగపడుతున్నాయి. 1980లోనే నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడే రాకెట్ లాంచింగ్పై పరిశోధన ఉన్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, డ్యాముల నిర్వహణ, పర్యావరణంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ప్రతి విద్యార్థి వృత్తిపరమైన నైపుణ్యం, వ్యక్తిగత సమగ్రతను పెంచుకోవాలి. అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించుకుని ముందుకుసాగాలి.