గంభీరంగా సాగుతున్న బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ఒక పదం విషయంలో కాస్త తొట్రుపాటు పడ్డారు. అదే సభలో నవ్వులు పూయించింది. వెహికల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ప్రకటన చేస్తూ పాత కాలుష్య వాహనాలను రీప్లేస్ చేస్తున్నామని చెప్పే సమయంలో ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్ అనాల్సిన చోటా ఓల్డ్ పొలిటికల్ అని వెంటనే నాలిక్కర్చుకున్నారు. ఈలోగా సభికులు గట్టిగా నవ్వడం మొదలెట్టారు. వెంటనే తేరుకున్న మంత్రి సారీ చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే దీనిపై ట్రోల్స్ మొదలయ్యాయి. పదిహేనేండ్ల తర్వాత వెహికల్స్లాగే పొలిటికల్ లీడర్స్ కూడా స్క్రాప్ కిందకే వస్తారని కొందరు ఫన్ చేస్తే.. పొరపాటున అన్నా.. బీజేపీ కూడా ఇక స్క్రాప్ కిందకే వస్తుందంటూ ఆమె మనోగతాన్ని విశ్లేషిస్తున్నారు మరికొందరు.
గతంలో ఆమెను ట్రోల్ చేసిన సందర్భాలివి
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గురించి ఓ జర్నలిస్టు 2022లో అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం వైరలైంది. ‘రూపాయి బలహీన పడిందని ఎవరు చెప్పారు.. డాలర్ బలపడుతున్నదంతే’ అని చెప్పారు. దీనిపై ఇటు నెటిజన్లు, అటు ప్రతిపక్ష పార్టీలు ఓ లెవెల్లో ఆడుకున్నారు. 2020లో కోవిడ్ విషయంలో కూడా ఇలాగే తోచిందేదో మాట్లాడి నవ్వులపాలయ్యారు. కొవిడ్పై కోపాన్ని వెళ్లగక్కిన మంత్రి ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని తేల్చిపారేశారు. అప్పుడు కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు.
ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే ప్రభుత్వంతో మాకు పనేంటి? అని ప్రశ్నించారు. 2019 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లిగడ్డలతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలపై, రైతు సమస్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దానిపై నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ ‘నేను వెజిటేరియన్ని, వెల్లుల్లి తినను, ఉల్లిపాయలు తినని ఇంటి నుంచి నేను వచ్చాను’ అని చెప్పారు. దీనిపై కూడా అప్పట్లో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. ఇప్పటికీ దీనిపై కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇలా పలుమార్లు నెటిజన్లకు పనిచెప్పారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.