Nirmala Sitharaman | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం.. అడ్డగోలుగా మాట్లాడి విషయాన్ని దారి మళ్లించడంలో తనకు తానే సాటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నిరూపించుకొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూటి ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. వీటికి ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేక తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు గుప్పించి విషయాన్ని పక్కదారి పట్టించారు. డీడీ డైలాగ్ పేరుతో గురువారం హైదరాబాద్లో దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక విధానాలపై సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై స్పందన కోరగా నిర్మల వింత సమాధానాలిచ్చారు. ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్య: 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రకటించి, సిల్లీ జోక్గా మార్చారు.
నిర్మల సమాధానం: 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అవమానించడం అంటే ప్రజలను అవమానించడమే. వీలైతే దానిని అందుకోవడానికి తెలంగాణ తమ వంతు పాత్ర పోషించాలి.
వాస్తవం: 2022 నాటికి దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ గతంలో ఘనంగా చెప్పుకొచ్చారు. ప్రధాని, కేంద్ర మంత్రులు పదేపదే ఇవే వ్యాఖ్యలు చేస్తూ ఏండ్లకేండ్లు పబ్బం గడుపుకొన్నారు. గడువు పూర్తయ్యేనాటికి 3.5 ట్రిలియన్ డాలర్లకు మాత్రమే చేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ 2024-25 నాటికి 5 ట్రిలియన్లు అంటున్నారు. పదేపదే మాట మార్చడం ద్వారా ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ’ అనే పదాన్ని జోక్గా మార్చింది కేంద్రం కాదా? దేశ ప్రగతిలో తెలంగాణ పాత్ర ఎంతో ఉన్నదన్నది ప్రతి ఒక్కరూ ఒప్పుకొనే సత్యం. 2014-15తో పోల్చితే రాష్ట్ర జీఎస్డీపీ రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 165 శాతం పెరుగుదల నమోదైంది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.1 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయం సైతం డబుల్ అయ్యింది. ఇది దేశాభివృద్ధిలో భాగం అవడం కాదా? తెలంగాణతో సమానంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగెడితే.. తెలంగాణ జీఎస్డీపీ రూ.15 లక్షల కోట్లు దాటేదన్న మాట వాస్తవం కాదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను అవమానించొద్దు.. చేతులెత్తి దండం పెడుతున్నా వంటి భావోద్వేగ మాటలతో తప్పించుకోవాలని చూడటం ఏంటని మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్య: కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చినదానికంటే.. తెలంగాణ ఈ దేశానికి ఇచ్చిందే ఎక్కువ.
నిర్మల సమాధానం: తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయంకంటే రాష్ర్టానికి కేంద్రం నుంచి చాలా ఎక్కువ ఇచ్చాం.
వాస్తవం: తెలంగాణ ఇప్పటివరకు కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పారు. కానీ.. రాష్ర్టానికి అంతకంటే ఎక్కువ ఇచ్చామంటూ నిర్మల సీతారామన్ లెక్కలు చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.1.39 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.1.30 లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇందులో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాబోయే లెక్కలను కూడా కలిపారు. ఇవి సుమారు రూ.40 వేల కోట్ల వరకు ఉంటాయి. ఇక రైల్వే లైన్లకు రూ.7 వేల కోట్లు ఇచ్చామని అన్నారు. ఇందులో రూ.4 వేల కోట్లు వచ్చే ఏడాది ఇచ్చేవే. మొత్తంగా సుమారు రూ.2.76 లక్షల కోట్ల లెక్క చెప్తే… అందులో రూ.40 వేలకుపైగా వచ్చే సంవత్సరానివే. వాటిని కూడా లెక్కల్లోకి తీసుకోవడం విచిత్రం.
సీఎం కేసీఆర్ వ్యాఖ్య: ప్రదాని మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారు.
నిర్మల సమాధానం: తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు దాటింది.
వాస్తవం: 2023-24 బడ్జెట్ అంచనాలతో కలిపితే మోదీ హయాంలో చేసిన అప్పు అక్షరాలా రూ.112 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రతి సెకనుకు రూ.5.34 లక్షల అప్పు చేయబోతున్నది. పదేండ్లలో జీడీపీ విలువ 140 శాతం పెరిగితే.. అప్పులు మాత్రం 170 శాతానికిపైగా పెరిగాయి. కేంద్రం ఏటా మిత్తీలకే రూ.8 లక్షల కోట్లు కడుతున్నది. వాస్తవానికి ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీడీపీలో కేంద్ర అప్పులు 40 శాతానికి మించరాదు. కానీ ప్రస్తుతం 56.2 శాతానికి పెరిగిపోయాయి. ఇవన్నీ వదిలేసి రాష్ట్ర అప్పులపై నిర్మల అడ్డగోలుగా మాట్లాడారు. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి జీఎస్డీపీలో తెలంగాణ అప్పులు 27.4 శాతం. దేశవ్యాప్తంగా అతితక్కువ రుణాలున్న పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణది ఐదో స్థానం. అత్యధిక అప్పుల జాబితాలో పంజాబ్ (48.4 శాతం) మొదటిస్థానంలో నిలిచింది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి బీజేపీ, కాగ్రెస్ పాలిత రాష్ర్టాలు అధ్వానంగా ఉన్నాయి. అయినా వాటిపై నిర్మల కామెంట్ చేయలేదు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై విమర్శలు చేశారు.
కేసిఆర్ వ్యాఖ్య: కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు.
నిర్మల సమాధానం: ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరితే తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలని అడిగింది. అప్పటికే అక్కడ మెడికల్ కాలేజీలు ఉండటంతో తిరస్కరించాం. కొత్త ప్రతిపాదన పంపాలని సూచించినా పంపలేదు.
వాస్తవం: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా లక్ష్మారెడ్డి ఉన్నప్పుడే 2019లోనే రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు మంజూరుచేయాలని అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు పదేపదే లేఖలు రాశారు. ఆయన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) మొదటి రెండు ఫేజ్లలో తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వటం సాధ్యం కాదని, మూడోఫేజ్లో ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి 2021, డిసెంబర్ 3.. రేవంత్రెడ్డి 2022 మార్చి 25న పార్లమెంటులో ప్రశ్నలు అడిగారు. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్పవార్ సమాధానమిచ్చారు. రెండు సందర్భాల్లోనూ ఆమె సమాధానం కూడా మారలేదు. ‘సీఎస్ఎస్ మూడో ఫేజ్లో భాగంగా తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. కానీ, రాష్ట్రం నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు’ అని మంత్రి స్పష్టంగా సమాధానమిచ్చారు. ఇప్పుడేమో కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని నిర్మలాసీతారామన్ సెలవిచ్చారు. ఇందులో ఎవరి మాట వాస్తవం. కేంద్రం పార్లమెంటును తప్పుదోవ పట్టించిందా? లేదంటే కేంద్ర ఆర్థికమంత్రి అబద్ధాలు చెప్తున్నారా? తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఏర్పాటుచేసేశామని సెలవిచ్చారు. ‘గత మూడేండ్లలో దేశవ్యాప్తంగా మోదీ సర్కారు 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసింది. వీటిలో 9 కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి’ అని 2021, జూలైలో ట్వీట్ చేశారు. కాలేజీల కోసం ప్రతిపాదనలే రాలేదని ఒకమంత్రి, ప్రతిపాదనలు సరిగా పంపలేదని మరోమంత్రి, కాలేజీలు ఇప్పటికే ఇచ్చేశామని మరో మంత్రి మాట్లాడటం విడ్డూరం.
తెలంగాణలో సీఎస్ఎస్ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి 2022, మార్చి 25న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఇచ్చిన సమాధానం
తెలంగాణలో సీఎస్ఎస్ కింద మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి 2021, డిసెంబర్ 3న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఇచ్చిన సమాధానం
1) రాయితీలు రూ.1.5 లక్షల కోట్లు తగ్గించడం నిజం కాదా?
2) కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది వాస్తవం కాదా?
3) కార్పొరేట్ పన్నులను 10 శాతం వరకు తగ్గించి.. సెస్సుల రూపంలో పేదలపై 10 శాతం పెంచింది మీరు కాదా?
4) ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో విద్య, వైద్యానికి తక్కువ నిధులు కేటాయించలేదా?
5) విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ప్యాక్టరీ వంటివాటిని ఎందుకు నెరవేర్చలేదు?
6) తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంటుల రూపంలో రూ.లక్ష కోట్లు బాకీ ఉన్నది వాస్తవం కాదా?
7) బడ్జెట్లో పెట్టిన మూలధన వ్యయంలో కనీసం 50 శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నది నిజం కాదా?
8) ద్రవ్యోల్బణం, ఆర్థికలోటు లక్ష్యాలను చేరుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతున్నదా? లేదా?
9) ఎంఎస్ఎంఈల పరిస్థితి, జీఎస్డీపీలో వాటి వాటా గురించి పార్లమెంట్లో అడిగినా స్పందించలేదన్నది వాస్తవం కాదా?
10) గుజరాత్కు, బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఇష్టం వచ్చినట్టుగా నిధులు విడుదల చేస్తూ, ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు అడ్డగోలుగా ప్రాజెక్టులు కేటాయిస్తూ తెలంగాణపై కక్ష చూపెడుతున్నది వాస్తవం కాదా? అడ్డగోలు కొర్రీలతో నిధులు ఆపుతున్నది కేంద్రం కాదా?