నిర్మల్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కిలో బంగారం,నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మరో కిలో బంగారాన్ని వితరణగా ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.