వనపర్తి : శ్రీశైలం నీటిని ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. కల్వకుర్తి పరిధిలో పంటలకు మరో నలభై ఐదు రోజులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు ఇవ్వాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయ ర్ను రైతులతో కలిసి సందర్శించచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో నాడు కేసీఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు.
90శాతం పూర్తి అయిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును తట్టెడు మట్టి తీయకుండా పడావు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. 27వేల ఎకరాల భూసేకరణ జరిపి రూ.32వేలకోట్ల ఖర్చు చేసి 27వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కేవలం రూ.1000కోట్లు ఖర్చు చేసి 10శాతం పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా సదరు ప్రాజెక్టును పడావు పట్టడమే కాకుండా రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పడం రైతులను మోసం చేయడం కోసమేనని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.