వరంగల్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్, నమస్తే తెలంగాణ: అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భరోసా ఇచ్చారు. రాళ్లవానతో పంటలు దెబ్బన్నాయని తెలిసి సీఎం కేసీఆర్ బాధపడ్డారని, పంట నష్టం తెలుసుకొని రావాలని తమను పంపించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా రావాలని ముందుగా అనుకున్నా అనివార్య కారణాలతో రాలేకపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మంగళవారం వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మంత్రి నిరంజన్రెడ్డి పర్యటించారు. పరకాల మండలం నాగారం, మల్లక్కపేట, నడికూడ మండలకేంద్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చెన్నాపురం, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇప్పలతండా పంటపొలాల్లో తిరిగారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పంట నష్టం వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. దేశంలో ఒక్క కేసీఆర్ సరారు మాత్రమే రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నదని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. ఇప్పటికే 8 విడుతల్లో రైతుబంధు కింద రూ.50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో రైతులకు న్యాయం జరగట్లేదని ధ్వజమెత్తారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద నిర్దిష్ట ప్రణాళికలు లేవన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే సరైన సమయంలో స్పందించడం లేదని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రతి రైతుకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతల నడ్డి విరుస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని చూస్తుంటే ఎరువుల ధరలు పెంచి కేంద్రం రైతులపై భారం మోపుతున్నదని మండిపడ్డారు. రైతులకు ఇప్పటివరకు సాయం చేసిందీ, భవిష్యత్తులో చేసేదీ సీఎం కేసీఆర్ ఒక్కరేనని స్పష్టంచేశారు. పంట నష్టం గురించి వివరించగానే సీఎం కేసీఆర్ చలించిపోయారని, వెంటనే రైతులను కలిసి భరోసా కల్పించాలని ఆదేశించారని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, భవేశ్మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
(వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్తండా రైతు ధరావత్ యాకమ్మతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంభాషణ..)
నిరంజన్రెడ్డి : ఇది ఎవరి శెలక?
యాకమ్మ: సార్ నాదే ఈ శెలక
మంత్రి : ఏమేం పంటలు వేశావమ్మా?
యాకమ్మ: సార్.. నాలుగు ఎకరాల్లో మిర్చి పెట్టిన
మంత్రి : ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టినవమ్మా?
యాకమ్మ: ఎకరానికి లక్షన్నర పెట్టిన సార్
మంత్రి : ఒక్కసారైనా పంట ఏరినవా?
యాకమ్మ : లేదు సార్
మంత్రి : ఏరే దశకు చేరినప్పటికి ఎందుకు ఏరలేదమ్మా?
యాకమ్మ : పండుగ తర్వాత ఏరుదామనుకున్నాం సార్.. ఇంతలోనే రాళ్లవాన పడి పంటంతా నాశనం అయ్యింది.
యాకమ్మ : మొన్నటి వానకు తోటంతా ఆగమయ్యింది సార్. మీరే దిక్కు సార్. వ్యవసాయం తప్ప వేరే ఆ దిక్కు లేదు సార్. ఆదుకోవాలె.