హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. పత్తి, కంది, నూనెగింజలు, ఆయిల్పామ్, కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కరోనా దృష్ట్యానే ప్రభుత్వం రైతుల పంటలను కొనుగోలు చేస్తున్నదని.. ఎల్లప్పుడూ ఇది సాధ్యం కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి లాభాలు గడించాలని సూచించారు.
సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచించారు. భూసారం పెంచుకునేందుకు జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలను వేసుకోవాలని, రైతులు వరి కొయ్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్చరాదని స్పష్టంచేశారు. వానకాలం సాగు సమాయత్తంపై మంగళవారం మంత్రి నిరంజన్రెడ్డి టీ-శాట్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధుకు రూ.14,800 కోట్లు, రైతుబీమాకు రూ.1,200 కోట్లు, రుణమాఫీకి రూ.5,225 కోట్లు, యాంత్రీకరణకు రూ.1,500 కోట్లు, విత్తన రాయితీ వంటి పథకాలకు కలిపి మొత్తంగా రూ.22 వేల కోట్ల నిధులను వ్యవసాయరంగానికి ప్రత్యక్షంగా కేటాయించినట్టు తెలిపారు. ఏడేండ్లలోనే వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని పేర్కొన్నారు.
వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రైతుబంధు సమితి రాష్ట్రఅధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సాగు ప్రణాళికకోసం రైతువేదికలను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. సమావేశాలు ఏర్పాటు చేసుకొని పంటల సాగుపై చర్చించుకోవాలని చెప్పారు. అధికారులు కూడా రైతు వేదికల్లో అందుబాటులో ఉంటారని, ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా వారిని నిరంతరం సంప్రదించవచ్చని తెలిపారు. అదేవిధంగా రైతుబంధు సమితి సభ్యులు కూడా నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ సహకరించాలని సూచించారు. రైతు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్రెడ్డి, వ్యవసాయ పరిశోధనా సంచాలకుడు జగదీశ్వర్ పాల్గొన్నారు.