హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకే 9 సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు మెజార్టీ టికెట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనైనా న్యాయం చేయాలని కోరారు. బీసీలకు కావాల్సింది రాయితీలు కాదని, రాజ్యాధికారంలో వాటా అని.. అప్పుడే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రకటించిన 6 స్థానాల్లో మూడింటిని బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సగం టికెట్లు ఇస్తేనే ఓట్లు వేస్తామని, లేదంటే తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.