హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గుండె జబ్బులు పెనుశాపంగా మారుతున్నాయి. మొత్తం మరణాల్లో దాదాపు 20% గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి. తెలంగాణలో 1990-2016 మధ్యకాలంలో నమోదైన మరణాలపై ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం ఇదే విషయాన్ని రూఢీ చేసింది. ఈ అధ్యయనం ఆధారంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) డిసీజ్ బర్డెన్ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. 1990లో నమోదైన మరణాల్లో 4.9% గుండె జబ్బుల కారణంగా సంభవిస్తే.. 2016లో అది 20 శాతానికి ఎగబాకింది. పురుషుల్లో 20%, మహిళల్లో 16% మరణాలకు గుండెజబ్బులే కారణంగా కనిపిస్తున్నాయి. గుండె జబ్బులు, రోడ్డు ప్రమాదాలతోపాటు ప్రాణాంతక వ్యాధులైన హెచ్ఐవీ, టీబీ, నెలలు నిండకముందే పుట్టడం, పుట్టుకతో వచ్చిన లోపాలు, కిడ్నీ వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవించినట్టు తేలింది. చనిపోతున్న వారిలో అకాల మరణం చెందినవారి సంఖ్య 61.6 శాతంగా ఉన్నట్టు వైల్లడైంది. 2016లో నమోదైన మరణాలను పరిశీలించగా.. 15 కారణాలు ఎక్కువ మందిని పొట్టనబెట్టుకొన్నట్టు స్పష్టమైంది.