Health | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఆహారపు అలవాట్లతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అందరికీ తెలుసు. కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆహార అలవాట్లపై పుష్కల సమాచారాన్ని చేతి వేళ్లపై దొరికేలా చేస్తుండటంతో ఎన్నో అపోహలు, ఉహాగానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార అలవాట్లకు శాస్త్రీయతను జోడించి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) డైటరీ గైడ్ లైన్స్ను రూపొందించింది. 2011 నుంచి అమలు చేస్తున్న 15 మార్గదర్శకాలను 12 ఏండ్ల తర్వాత ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా సవరించింది. ఇటీవల కాలంలో హైఫ్యాట్, షుగర్, సాల్ట్ ఆహారాల వినియోగం విపరీతంగా పెరగడంతో ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఈ సూచనలు ప్రస్తుతం ఐసీఎంఆర్ తుది పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లోగా పబ్లిక్ డొమైన్లోకి రానున్నాయి.
మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, గర్భిణులు తమ వయసు, స్థితిగతులకు అనుగుణంగా తీసుకోవాల్సిన క్యాలరీలు, పోషక విలువలు, సూక్ష్మపోషకాలను ఎన్ఐఎన్ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. సాధారణంగా సగటు మనిషి 2,400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లతోపాటు జీవక్రియలు సజావుగా సాగేందుకు ఐరన్, ఫోలిక్యాసిడ్, విటమిన్లు, సూక్ష్మ పోషకాలు తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం రోజువారీ ఆహారంలో 396 గ్రాముల చిరుధాన్యాలు, 28 గ్రాముల పప్పులు, 82 గ్రాముల పాలు, పాల పదార్థాలు, 49 గ్రాముల కూరగాయలు, 14 గ్రాముల నూనె/నెయ్యి తీసుకోవాలని ఎన్ఐఎన్ స్పష్టంచేసింది. వీటిలో మాత్రం మార్పులు వచ్చినా శరీర ఎదుగుదల మందగించి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.