హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నగరం నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిమ్స్ దవాఖానలు రాష్ట్ర వైద్య రంగానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేయబోతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ‘హైబ్రిడ్’ విధానంలో నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 50 శాతం పడకలను జనరల్ కన్సల్టేషన్ విధానంలో, మరో 50 శాతం పడకలను నిమ్స్ తరహాలో నిర్వహించాలన్న వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్, గచ్చిబౌలిలో ప్రభుత్వం టిమ్స్ దవాఖానలను నిర్మిస్తున్నది.
ఇందులో అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్ దవాఖానల నిర్మాణానికి సీఎం కేసీఆర్ గతఏడాది ఏప్రిల్ 27న శంకుస్థాపన చేశా రు. ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో చోట మొత్తం 30 విభాగాల్లో వైద్య సేవ లు అందుతాయి. హైబ్రిడ్ మాడల్లో భాగంగా 500 పడకలకు సంబంధించి గాంధీ, ఉస్మానియా తరహాలో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. మిగతా 500 పడకలకు సంబంధించి నిమ్స్ తరహాలో నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. ప్రస్తుతం నిమ్స్లో రోగులు పొందే సేవలకు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఫీజు చెల్లిస్తున్నది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులు, ఆరోగ్య శ్రీ కార్డు లేనివారికి మాత్రం నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.