హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా నీట్ ఎస్ఎస్-2025 ప్రవేశ పరీక్షల్లో నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ఎండీ రెసిడెంట్ వైద్య విద్యార్థులు మరోసారి సత్తా చాట్టారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షలో నిమ్స్ వైద్య విద్యార్థులు ఆల్ ఇండియా 2వ ర్యాంకుతోపాటు, 27, 40, 84వ ర్యాంకులను కైవసం చేసుకున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప వెల్లడించారు. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ఎండీ రెసిడెంట్ వైద్య విద్యార్థులు డాక్టర్ బీ సిద్ధార్థ్రావు ఆల్ ఇండియా 2వ ర్యాంకు, డాక్టర్ కే తిరుమల బాబు 27వ ర్యాంకు, డాక్టర్ శ్రీలేఖ్య 40వ ర్యాంకు, డాక్టర్ సిద్ధార్థ్ సాధ్నానీ 84వ ర్యాంకు, డాక్టర్ ధరణి 399వ ర్యాంకు, డాక్టర్ ఆశ్రిత్ 417వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు.
వీరితోపాటు ఇతర విభాగాల్లోని ఎండీ రెసిడెంట్ వైద్యలు సైతం ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని, వీరంతా ఆయా విభాగాల్లో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ (సూపర్ స్పెషాలిటీ)ల్లో సీట్లు పొందనున్నట్టు వివరిం చారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సుబ్బలక్ష్మి, డాక్టర్ ఎంఎన్ రావు, డాక్టర్ నవల్ చంద్ర మాట్లాడుతూ.. జనరల్ మెడిసిన్ విభాగం నుంచే ఆరుగురు వైద్య విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో టాప్ ర్యాంక్లు సాధించడం గర్వకారణమని చెప్పారు. 2023లో డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం, 2024లో డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆల్ ఇండియా మొదటి ర్యాంకులను సాధించి దేశంలోనే టాపర్లుగా నిలిచారని గుర్తుచేశారు.