హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని అధిగమించింది. తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన రోగులకు నిర్వహించే ఖరీదైన పీఎంఎంసీ (ఫెక్టోరాలిస్ మేజర్ మయో క్యుటేనియల్ ఫ్లాప్) చికిత్సను ఆరోగ్యశ్రీ కింద నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నది. బుధవారం 500వ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్యాన్సర్ సోకిన రోగిని రక్తపోటు, మధుమేహం, గుండె, కాలేయం, కిడ్నీ తదితర బహుళ సమస్యలు చుట్టుముట్టి ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్యులు చెప్తున్నారు.
సాధారణంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రోగులకు శస్త్రచికిత్స చేయాలంటే కార్పొరేట్ దవాఖానల్లో దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖరీదైన చికిత్సతోపాటు ఫాలోఅప్ సేవలను నిమ్స్లో ఉచితంగానే అందిస్తున్నట్టు సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ శాంతప్ప, హెడ్ అండ్ నెక్ సర్జికల్ స్పెషలిస్ట్ డాక్టర్ శుభ్రాన్షు జీనె తెలిపారు. గతంలో ఈ శస్త్రచికిత్స చేయించుకోవాలంటే దవాఖానలో 10 నుంచి 15 రోజులు ఉండాల్సి వచ్చేది. శస్త్రచికిత్సకు సుమారు 10 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం నిమ్స్లో ఉన్న ఆధునిక వైద్య సౌకర్యాలు, కొత్త టెక్నిక్స్తో 3 నుంచి 4 గంటల్లోనే సర్జరీ పూర్తిచేస్తున్నట్టు డాక్టర్ శుభ్రా న్షు జీనె తెలిపారు. 5వ రోజే రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా డిశ్చార్జ్ చేస్తున్నట్టు వివరించారు.
పీఎంఎంసీ అంటే..
సాధారణంగా తల, మెడ భాగానికి క్యాన్సర్ సోకిన రోగులకు ముఖంలోని భాగాలు దెబ్బతింటాయి. దెబ్బతిన్న భాగాలను ఎముక, కండరాలతో సహా తొలగించాల్సి ఉంటుంది. ఫలితంగా అక్కడ ఏర్పడ్డ ఖాళీ భాగాన్ని పూడ్చడానికి సాధారణంగా కాలు నుంచి చర్మం, కండరాలను తీసుకుంటారు. కానీ పీఎంఎంసీ పద్ధతిలో ఛాతి భాగం నుంచి చర్మాన్ని, కండరాలను తీసుకుంటారు. ఈ ప్రక్రియను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేస్తారు. సాధారణంగా క్యాన్సర్ శస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీలను వేర్వేరు స్పెషాల్టీ వైద్యులు చేస్తారు. కానీ నిమ్స్లో మాత్రం సర్జికల్ ఆంకాలజిస్టులే చేస్తుండటం విశేషం.
స్క్రీనింగ్పై శిక్షణ ఇస్తున్నాం
క్యాన్సర్ వ్యాధులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్క్రీనింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. నిమ్స్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాం. ఇక్కడ నర్సులు, ఏఎన్ఎంలకు స్క్రీనింగ్పై శిక్షణ ఇస్తున్నాం. వీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.
– డాక్టర్ రాజశేఖర్ శాంతప్ప, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి
స్పష్టంగా మాట్లాడ గలుగుతున్నా
నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ను. నా నాలుకకు క్యాన్సర్ వచ్చింది. నోటి మాట పోయింది. ఆహారం తీసుకోలేని పరిస్థితి. ఎన్ని దవాఖానలకు వెళ్లినా భరోసా ఇవ్వలేదు. 2017లో నిమ్స్కు వచ్చాను. అక్కడ టెస్ట్లు చేసి సర్జరీ చేశారు. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. నాకు పునర్జన్మ ఇచ్చిన నిమ్స్ వైద్యులకు కృతజతలు.
– సంతోష్, సాఫ్ట్వేర్ ఇంజినీర్