హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/న్యూస్ నెట్వర్క్: ఉగ్రవాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగప్రవేశం చేసింది. ఎన్ఐఏ బృందాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోని పలువురు నిందితులు, అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, భైంసాతోపాటు ఏపీలోని నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాదాపు 5 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. నిజామాబాద్ జిల్లాలో 23, హైదరాబాద్లో 4, జగిత్యాలలో 7, నిర్మల్లో 2, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కోచోట తనిఖీలు కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, నవీపేట, ఆర్మూర్, ఎడపల్లి, అర్సపల్లి, ఆటోనగర్, హౌసింగ్బోర్డు ఏరియాల్లో మొత్తం 23 ఇండ్లలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. నిజామాబాద్లో లభించిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ బృందాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణం మదీనా కాలనీలోని రెండు ఇండ్లలో సోదాలు నిర్వహించారు.
ఐయాజ్ అనే వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో సోమవారంలోగా తమ ముందు హాజరవ్వాలని నోటీసులు జారీచేశారు. ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్లో ఫిరోజ్ఖాన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించారు. ఉగ్రవాద శిక్షణతో పాటు భైంసా అల్లర్లతో వీరికి సంబంధం ఉన్నదనే కోణంలో అధికారులు విచారణ జరిపినట్టు తెలిసింది. జగిత్యాల టవర్ సర్కిల్లోని కేర్ మెడికల్, టీఆర్నగర్లోని ఒక ఇంటిలో సోదాలు నిర్వహించి డైరీలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడి వారు ఇచ్చిన సమాచారం మేరకు కరీంనగర్లోని బంధువుల ఇంట్లో తలదాచుకొంటున్న జగిత్యాలకు చెందిన ఎండీ ఇర్ఫాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం సాయిబాబానగర్లో ఉన్న జామియా తలీముల్ ఇస్లాం లిలిబనత్ (గర్ల్స్) మదర్సాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్నదనే అనుమానంతో మదర్సా నిర్వహకుడు అబ్దుల్ వాహబ్ సోదరుడు సలీంను అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. తనిఖీలు చేసిన ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల హార్డ్ డిస్క్లతో పాటు మదర్సాలోని రెండు హార్డ్ డిస్క్లను ఎన్ఐఏ బృందం స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తున్నది.
అదుపులోకి నలుగురు: ఎన్ఐఏ వెల్లడి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆదివారం మొత్తం 38 ప్రాంతాల్లో సోదాలు చేసి, నలుగురిని అదుపులోకి తీసుకొన్నట్టు ఎన్ఐఏ ప్రకటించింది. తనిఖీల్లో డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, రూ.8.31 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నట్టు వివరించింది. అత్యధికంగా నిజామాబాద్లో 23 చోట్ల సోదాలు చేశామని తెలిపింది. కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో పీఎఫ్ఐ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించామని వెల్లడించింది. మతకలహాలు సృష్టించేందుకు ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నది. కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తామని ఎన్ఐఏ వెల్లడించింది. జులై 4న అబ్దుల్లా ఖాదీర్, షేక్ సహదుల్లా, ఇంబ్రాన్, అబ్దుల్ మోబిన్ అనే నలుగురు పీఎఫ్ఐ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని, వారి ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
జూలైలోనే మూలాలు ఛేదించిన తెలంగాణ పోలీసులు
నిజామాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన మూలాలు గత జూలైలోనే బయటపడ్డాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జూలై 4న నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు జగిత్యాలకు చెందిన అబ్దుల్ ఖాదర్తో పాటు షేక్ షహదుల్లా, ఎండీ ఇమ్రాన్, అబ్దుల్ మోహిన్ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేశారు. ఈ కేసులో ఉగ్రవాద లింకులు బయటపడటంతో ఎన్ఐఏకు సమాచారం అందించారు. దీంతో ఎన్ఐఏ ఆగస్టు 26న కేసు నమోదు చేసింది. ఉగ్రదాడులు, మతోన్మాద కుట్రలు, ఇతర వర్గాలపై దాడులకు పాల్పడేలా శిక్షణ ఇస్తున్న పీఎఫ్ఐ ప్రధాన నిర్వాహకుడు, జగిత్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్తోపాటు 28 మందిపై నిజామాబాద్ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగానే అనుమానితుల ఇండ్లలో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మతద్వేషాలను రెచ్చగొట్టడం, మతకల్లోలాలు, గొడవలు సృష్టించడం, దాడులకు ప్రేరేపించడం లాంటి అంశాలల్లో మదర్సాల్లో ఎంపిక చేసిన వందలాది యువకులకు శిక్షణ ఇచ్చినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన యువతకు అబ్దుల్ఖాదర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. కరాటే ముసుగులో జరిగిన ఉగ్రకుట్రలో ఇంకా ఎవరెవరికి భాగస్వామ్యం ఉన్నదనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది.