Earth Quake | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు గల కారణాలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు స్పందించారు.
భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కామన్ అని చెప్పారు. మళ్లీ భూ ప్రకంపలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో నమోదైందని తెలిపారు. భూప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
కాగా, గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని ఎన్జీఆర్ఐ డైరెక్టర్ తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపైనే ఎక్కువ ప్రభావం ఉందని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల నుంచి 300 కి.మీ.వరకు భూకంప ప్రభావం ఉంటుందని అన్నారు. అందువల్లే హైదరాబాద్లో భూమి కంపించిందని వివరించారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పాత భవనాలు, పగుళ్లు వచ్చిన భవనాలను ఖాళీ చేయడం మంచిదని సూచించారు.