Road Safety Cess | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కార్ వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వేలల్లో అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మార్చి ఒకటి నుంచి తెలంగాణలో ‘రోడ్సేఫ్టీ పన్ను’ వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు తమ వాహన స్థాయిని బట్టి.. రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ ఆర్టీఏకు సమర్పించుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా కొత్తగా సుమారు 7 లక్షల వరకు ద్విచక్ర వాహనాలు, 2.57 లక్షల వరకు వివిధ రకాల ఫోర్వీలర్స్ రోడ్లపైకి వస్తున్నాయి. సుమారు లక్ష వరకు లైట్, హెవీ వెహికిల్స్ను కొంటున్నారు. ఈ క్రమంలో వాహన కొనుగోళ్లను, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఆసరాగా చేసుకొని తెలంగాణలో కూడా రోడ్ సేఫ్టీ పన్ను వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రభుత్వం జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రోడ్సేఫ్టీ పన్ను బిల్లును ఆమోదించింది. మార్చి ఒకటి నుంచి ఈ పన్ను అమల్లోకి వచ్చేలా రవాణాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ట్యాక్స్ అమల్లోకి వస్తే.. తెలంగాణ రవాణాశాఖకు రూ.350-రూ.390 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నాన్ ట్రాన్స్పోర్టు వాహనదారులపై ఆయా వాహన శ్రేణిని బట్టి రూ. 2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా వసూ లు చేయనున్నారు. బైక్లు, కార్లతోపాటు ఇతర వ్యక్తిగత వాహనాలు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. కొత్తగా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించే సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ నుంచి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు రేవంత్ సర్కార్ పథకం రచించింది. ఇప్పటికే రూ.7,519 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదించనున్నది. ముఖ్యంగా లైఫ్ట్యాక్స్ ద్వారా రూ.5,143 కోట్లు, త్రైమాసిక పన్నులతో రూ.1,031 కోట్లు, కొత్తగా రోడ్సేఫ్టీతో రూ.350-రూ.390 కోట్లు పన్నుల రూపం లో వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రవాణాశాఖ పన్నుల ద్వారా రూ.5,788 కోట్లు వసూలు చేసింది. గతంతో పోల్చితే పన్నుల ద్వారానే ఆదాయాన్ని రెట్టింపు చేసుకొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
రోడ్డు ప్రమాదాల్లో మరణాలను అరికట్టేందుకు, వాహనదారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. మోటర్ వెహికిల్స్ చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఆ మేరకు అన్ని రాష్ర్టాలు డెడికేటెడ్ రోడ్డు భద్రతా ఫండ్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్ను రోడ్డు సేఫ్టీకే వినియోగంచాల్సి ఉంటుంది.