హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): వరిసాగులో వెదజల్లే విధానం అనుసరించాలని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్రెడ్డి రైతులకు సూచించారు. తద్వారా తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. వెదజల్లే విధానంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ‘టీ-శాట్’ ద్వారా ఏర్పాటుచేసిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరిసాగులో సంప్రదాయ పద్ధతులను వీడి.. అధునాతన పద్ధతులను అవలంబించాలని సూచించారు. వెదజల్లే సాగుతో పంటకాలం తగ్గుతుందని, అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవచ్చని చెప్పారు. భవిష్యత్లో వరినాటు విధానం ఎవరూ అవలంబించే పరిస్థితి లేదని చెప్పారు. అన్నం తినేవారి సంఖ్య తగ్గుతున్నదని, వరిసాగును కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. వరిసాగును తగ్గించి పత్తిసాగును పెంచాలని రైతులకు సూచించారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు అందించినట్టు తెలిపారు. తొలిరోజు సుమారు 17 లక్షల మంది రైతులకు రూ.600 కోట్లు అందజేసినట్టు వివరించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వెదజల్లే పద్ధతి అనుసరిస్తున్న రైతులు మంచి ఫలితాలను పొందుతున్నారని తెలిపారు.