హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరికీ త్వరలో కొత్త రేషన్కార్డులు జారీచేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ తుదిదశకు చేరిందన్నారు. బుధవారం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లో అధికారులు గత 15 రోజుల నుంచి నిర్విరామంగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారని వివరించారు. పేదల కడుపు నింపాలన్న తపనతో సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, కొత్త రేషన్కార్డుల జారీ వల్ల ఎంత భారం పడినా ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.