హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు.
పౌరసరఫరాలశాఖపై మంత్రి గంగుల కమలాకర్, అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లింగ్ సామర్థ్యం పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర అంశాలపై సీఎం చర్చించారు. జూలై 26 నుంచి 31వ తేదీ దాకా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ను సీఎం ఆదేశించారు.