హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సీఎం ఇంటికి పాదయాత్ర’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్ నుంచి బంజరాహిల్స్ వరకు పాదయాత్రగా వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరుగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. విద్యార్థి సంఘం నేతలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడారు.
ఫీజు బకాయిల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టంచేశారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. ఫీజు బకాయిలు విడుదల కాక విద్యా సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ఇంటికి పాదయాత్రగా వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుల అక్రమ అరెస్టును సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఖండించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.