Hyderabad | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తెలంగాణ పోలీస్ ఠాణాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశంలో పోలీస్ శాఖలో చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
నగరంలోని నిజాం కాలం నాటి పాత పోలీస్స్టేషన్ల స్థానంలో 26 కొత్త ఠాణాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, అందులో 13 పోలీస్ స్టేషన్ల భవనాలను ప్రారంభించుకొన్నామని తెలిపారు. మార్చిలో బేగంబజార్, షాయినాయత్గంజ్, బోయినపల్లి పోలీస్ స్టేషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కుల్సుంపురా, షాలిబండ, హుమాయూన్నగర్ స్టేషన్ల భవన నిర్మాణాలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పోలీస్ స్టేషన్లు కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా సకల హంగులతో ఉన్నాయని తెలిపారు. విశాలమైన సమావేశ మందిరాలు, ఆహ్లాదకర రిసెప్షన్, ఇంటర్నెట్, టీవీ సౌకర్యంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.