హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) త్వరలో వేతన జీవులకు శుభవార్త చెప్పనున్నది. సంఘటిత రంగంలో రూ.15 వేల కంటే ఎక్కువ మూలవేతనం (బేసిక్ శాలరీ) పొందుతున్న ఉద్యోగుల కోసం ఓ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురాబోతున్నది. 1995 నాటి పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) పరిధిలోకి రాని ఉద్యోగులకే ఈ స్కీమ్ వర్తించనున్నది. గువాహటిలో వచ్చే నెల 11, 12న జరిగే ఈపీఎఫ్వో అత్యున్నత నిర్ణాయక మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ స్కీమ్పై నిర్ణయం తీసుకోనున్నది. కొత్త స్కీమ్ అమల్లోకి వస్తే దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులందరికీ సమాన పెన్షన్ కల్పిస్తున్న విధానాన్ని చాలా మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల మూలవేతనం రూ.15 వేల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ రూ.15 వేలుగానే పరిగణిస్తుండటం, అందులో 8.33 శాతాన్ని మాత్రమే ఈపీఎస్-95లో జమ చేస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ తక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈపీఎస్లో ఎక్కువ మొత్తాన్ని జమ చేయడం ద్వారా అధిక పెన్షన్ను పొందే వెసులుబాటు కల్పించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో సీబీటీ గతేడాది నవంబర్లోనే ఓ సబ్కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే అన్ని వివరాలు సేకరించి తుది నివేదికను బోర్డుకు సమర్పించింది. గతంలో రూ.6,500గా ఉన్న కనీస మూలవేతన పరిమితిని 2014లో రూ.15 వేలకు పెంచారు. దాన్ని రూ.25 వేలకు పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే సీబీటీ సమావేశంలో ఈ అంశం కూడా పరిశీలనలోకి రానున్నట్టు సమాచారం. కానీ, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. దీంతో కనీస మూలవేతన పరిమితిని ఇప్పట్లో పెంచకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.