హైదరాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నప్పటికీ, ఎత్తయిన ప్రదేశాల్లో ఉండి సాగునీరందని గ్యాప్ఆయకట్టు కోసం 35 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి తెలిపారు. బంజారాహిల్స్లోని ఐడీసీ కార్యాలయంలో శుక్రవారం ఐడీసీ పరిధిలోని ఎత్తిపోతల పథకాల పురోగతి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా చర్చించారు. అనంతరం వేణుగోపాలాచారి మాట్లాడుతూ నాబార్డ్, ఏఐబీపీ, రాష్ట్ర బడ్జెట్ మొత్తంగా కలిపి ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో రూ.269.54 కోట్లను ఐడీసీకి కేటాయించిందని వెల్లడించారు. ప్రస్తుతం 538 ఎత్తిపోతల స్కీముల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.69 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. 743.19 కోట్లతో చేపట్టిన మరో 37 స్కీముల పనులు కొనసాగుతున్నాయని, ఆ పనులు పూర్తయితే మరో 65 వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు.
పలుచోట్ల ఎత్తుప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు ఆయా ప్రాజెక్టుల ద్వారా సాగునీరందని పరిస్థితి ఉన్నదని వివరించారు. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ఆయకట్టుకు సైతం సాగునీరందించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు 35 ఎత్తిపోతల స్కీములను ప్రతిపాదించారని వివరించారు. వాటన్నింటిపైనా సమావేశంలో చర్చించామని తెలిపారు. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నామని వెల్లడించారు. గ్యాప్ఆయకట్టులో దళితులు, గిరిజనుల ఆయకట్టుకు అత్యధిక ప్రాధాన్యమివ్వనున్నట్టు వేణుగోపాలాచారి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్) నాగేంద్రరావు, భూగర్భజలశాఖ డైరెక్టర్ పండిత్ మడ్నూరే, టీఎస్ఐడీసీ ఎండీ విద్యాసాగర్, బోర్డు మెంబర్లు లత, వినోద్ తదితరులు పాల్గొన్నారు.