హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు రంగం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నిక ఫలి తాలు 13న ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం 11 గంటలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సంబంధిత కమిషనర్లు ప్రమాణం చేయిస్తారు. అనంతరం చైర్మన్/వైఎస్ చైర్మన్, మేయర్/డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. కోరం(సగం మంది ఎన్నికైన సభ్యులు)హాజరైతే మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్/వైఎస్ చైర్మన్, మేయర్/డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు ఉపక్రమిస్తారు. కోరం లేకుంటే ఎన్నికను మరో రోజుకు వాయిదా వేస్తారు.
చేతులెత్తే విధానంలో ఎన్నిక..
ఎన్నికైన వార్డు సభ్యులు మాత్రమే మేయర్ లేదా చైర్పర్సన్ పదవులకు పోటీ చేయడానికి అర్హులు. రిజర్వేషన్లు అమలులో ఉన్నచోట ఆయా క్యాటగిరీల వ్యక్తులు మాత్రమే పోటీ చేయాలి. చేతులెత్తడం ద్వా రా ఎన్నిక జరుగనున్నది. మొదట మేయర్ లే దా చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేపడతారు. ఒకే అభ్యర్థి ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎకువ మంది ఉంటే ఎకువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
పార్టీ అభ్యర్థులకు విప్ జారీ..
ఆయా పార్టీలు తమ సభ్యులకు నిర్దిష్ట అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేస్తాయి. ఒకవేళ ఎవరైనా సభ్యుడు పార్టీ విప్ పాటించకుండా వేరే వారికి ఓటు వేస్తే, వారి సభ్యత్వం రద్దవుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీలు మూడు రోజుల్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయాలి. కలెక్టర్ వారంలో సదరు సభ్యుడి వివరణ కోరతారు. సరైన సమాధానం ఇవ్వకపోతే సభ్యత్వం రద్దు చేస్తారు. కానీ, వారు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది.
ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం..
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అధికారం కలిగి ఉంటారు. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోనైనా ఓటువేసే అవకాశం ఉండగా, దానిని మార్చి ఆయా మున్సిపాలిటీల పరిధిలోని సభ్యులకే ఓటు వేసే అవకాశం కల్పించారు.