హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పామాయిల్ దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. పలురకాల సబ్సిడీలతోపాటు పండిన పంటను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుండటంతో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. దీంతో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటును వేగవంతం చేస్తున్నది. కొత్తగా రెండు ఫ్యాక్టరీల ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న రెండు పాత ఫ్యాక్టరీలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. నూతనంగా ఆయిల్పామ్ సాగవుతున్న సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ పెట్టుబడితో నూతన ఫ్యాక్టరీలను స్థాపించాలని నిర్ణయించింది. వీటివల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు ప్రైవేటు కంపెనీలు కూడా జిల్లాకొక ఫ్యాక్టరీ చొప్పున ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి.
2025 కల్లా నూతన ఫ్యాక్టరీలు సిద్ధం
ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆయిల్పామ్ సాగు జోరుగా సాగుతుండటంతో నాలుగేండ్లలో పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. గెలలు వచ్చే సమయానికి రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ఆయిల్ఫెడ్, ఇతర ప్రైవేటు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణానికి, పాత ఫ్యాక్టరీల విస్తరణకు ఆయిల్ఫెడ్ సుమారు రూ.550 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నది. ఇందులో రూ.250 కోట్లతో సిద్దిపేట జిల్లాలో గంటకు 60 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఒకటి, రూ.150 కోట్లతో గద్వాల జిల్లాలో 30 టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీని 2025 కల్లా అందుబాటులోకి తెచ్చే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రూ.25 కోట్లతో ప్రస్తుతం అప్పారావుపేటలో ఉన్న 45 టన్నుల ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 90 టన్నులకు పెంచనున్నారు. రూ.130 కోట్లతో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో 30 టన్నుల ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 90 టన్నులకు పెంచనున్నారు. పాతవి, కొత్తవి కలిపి సుమారు 3వేల మందికి ఉపాధి లభించనున్నది.
కొత్తరకం టెక్నాలజీ
అత్యాధునిక సాంకేతికతతో నూతన ఆయిల్పామ్ ఫ్యాక్టరీలను నిర్మించనున్నారు. గతంలో ఉన్న ఫ్యాక్టరీలు భారీ విస్తీర్ణంలో ఉండటంతోపాటు పెట్టుబడి వ్యయం బాగా అయ్యేది. ఇప్పుడు నిర్మించేవి నిలువు పద్ధతిన ఏర్పాటు చేయనుండటంతో 70 శాతం స్థలం ఆదా కావడంతోపాటు 20 శాతం పెట్టుబడి ఖర్చు తగ్గనున్నది. ఇటీవలే ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం మలేషియాలో పర్యటించి అధ్యయనం చేసి వచ్చింది.
లక్ష ఎకరాలు దాటనున్న సాగు
ఒకప్పుడు వందల ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ సాగు ఈ ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల మార్క్ దాటనున్నది. ప్రస్తుతం 8 జిల్లాల్లో ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో 58 వేల ఎకరాలు సాగు అవుతుండగా, ‘మిషన్ ఆయిల్పామ్’లో భాగంగా గత డిసెంబర్ నాటికి 27 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు. తాజాగా మార్చి నాటికి మరో 23 వేల ఎకరాల సాగు అందుబాటులోకి రానున్నది. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఎప్పటి నుంచో సాగు చేస్తుండగా గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో కొత్తగా సాగు మొదలుపెట్టారు.
గెలల ధర అదరహో
ఆయిల్పామ్ గెలల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత సెప్టెంబర్లో టన్నుకు రూ.16 వేలకు పైగా పలకగా అక్టోబర్లో రూ.12,996కి పడిపోయింది. నవంబర్, డిసెంబర్ నెల నుంచి మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. నవంబర్లో టన్నుకు రూ.13,741, డిసెంబర్లో రూ.13,881 పలికింది. గతేడాది జూన్లో రికార్డుస్థాయిలో టన్ను గెల రూ.23,467 పలకడం విశేషం.
లాభసాటిగా ఆయిల్పామ్ సాగు
ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. ఈ పంట రైతులకు లాభసాటిగా మారింది. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో త్వరలో లక్ష ఎకరాల సాగు మార్క్ను దాటనున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల ఆసక్తితో ఇది సాధ్యం కానున్నది.
-కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్
వేగంగా ఫ్యాక్టరీల నిర్మాణం
ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ సాగవుతున్న జిల్లాల్లో కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట చేతికొచ్చేనాటికి ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేస్తాం. పెరుగుతున్న ఆయిల్పామ్ సాగు దృష్ట్యా తొలిదశలో రెండు నూతన ఫ్యాక్టరీల నిర్మాణంతోపాటు రెండు పాత ఫ్యాక్టరీలను విస్తరిస్తున్నాం.
-సురేందర్, ఆయిల్ఫెడ్ ఎండీ