హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): 23 జిల్లాల్లో కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో కేసుల సంఖ్య తగ్గడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రూ.1,414.31 కోట్లతో న్యాయశాఖ పద్దును మంత్రి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కొత్తగా 87 జూనియర్, సీనియర్, జిల్లా కోర్టులను ఏర్పాటు చేశామని, న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి 3,347 పోస్టులను మంజూరు చేశామని చెప్పారు. పెట్టుబడుల కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్లో పారదర్శక విధానాలు, అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను నెలకొల్పినట్టు పేర్కొన్నారు. నూతనంగా 23 న్యాయసేవా సాధికార సంస్థలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 3,311 అవగాహన క్యాంపులు, 2,383 లోక్ అదాలత్ బెంచ్ను నిర్వహించామని చెప్పారు. 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ (పోక్సో) కోర్టులను ఏర్పాటు చేయడంతోపాటు ఈ కేసుల్లో బాధితులకు రూ.2.9 కోట్ల పరిహారం అందించినట్టు వెల్లడించారు. జ్యుడిషియల్ ఆఫీసర్స్, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా న్యాయవాదితోపాటు వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల ఆరోగ్య బీమా, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కింద రూ.10 లక్షలు చెల్లిస్తున్నామని అన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.81 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.
ఎనిమిదిన్నరేండ్లలో 273 కోట్ల మొకలు
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, మొకల పెంపకం, అటవీ పునర్జీవం, భూసార తేమ పరిరక్షణ, అడవుల నిర్వహణ సామర్థ్యం తదితర చర్యలు చేపడుతున్నట్లు అటవీశాఖ మంత్రి ఐకే రెడ్డి తెలిపారు. రూ.1471.34 కోట్లతో అటవీ,పర్యావరణశాఖ పద్దును మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు 35 కోట్ల మొకలు నాటితే.. ఎనిమిదిన్నరేండ్లలో 273 కోట్ల మొకలు నాటామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ చర్యల వల్ల నేడు తెలంగాణ పచ్చబడటంతోపాటు సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. అటవీశాఖ బలోపేతానికి 1,418 ఉద్యోగాల భర్తీ చేపట్టగా, మరో 1437 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. పచ్చదనంలో హైదరాబాద్కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని ఆయన తెలిపారు.
రూ.387 కోట్లతో 1,742 ఆలయాల అభివృద్ధి
ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంత ఆలయాలకు రూ.79.12 కోట్లతో 691 పనులు చేపట్టగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కామన్ గుడ్ ఫండ్, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ.387.83 కోట్లతో 1,742 ఆలయాల అభివృద్ధి చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో దేవాదాయ, ధర్మాదాయశాఖ పద్దును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు గతంలో రూ.2,500 ఇవ్వగా, ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచడంతోపాటు కొత్తగా 1,840 ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్టు వివరించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని, వేములవాడ ఆలయ విస్తరణకు రూ.77.90 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ.100 కోట్లు, యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.200 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించామన్నారు. ఆలయ భూముల సంరక్షణలో భాగంగా 5,217 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, మరో 26 వేల ఎకరాల్లో సైన్ బోర్డులు పెట్టినట్టు వివరించారు. 14 ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా పరిస్థితిని సమీక్షించేలా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు.