PRLIS | మహబూబ్నగర్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వికారాబాద్(నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కరువు నేలపై కృష్ణమ్మ జలతాండవం చేసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శనివారం ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద ముందుగా పీఆర్ఎల్ఐ పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
అక్కడే కంట్రోల్ రూంలో మొదటి పంపును స్విచ్ ఆన్ చేశారు. అనంతరం కిలోమీటర్ దూరంలో ఉన్న సిస్టర్న్ వద్ద మొదటి పంపు ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు ఎగిరి దుంకాయి. ఈ మహోజ్వల ఘట్టాన్ని కండ్లారా చూసిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. అనంతరం కృష్ణాజలాలకు పుష్పాభిషేకం చేశారు. ఎత్తిపోతల ద్వారా దుంకిన కృష్ణా జలాలను గ్రామాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన కలశాలకు శాస్రోక్తంగా పూజలు చేసి.. మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం కేసీఆర్ అందజేశారు.
సీఎం కేసీఆర్ మహాబాహుబలి మోటరును ఆన్చేయగానే నీళ్లు నార్లాపూర్ రిజర్వాయర్లోకి దుంకాయి. ఈ జలదృశ్యాన్ని కండ్లారా చూసేందుకు చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు సెల్ఫీలు దిగారు. కృష్ణానదీ జలాలను తనివితీరా చూసి పులకించిపోయారు. ‘కేసీఆర్ మళ్లీ రావాలి.. ముఖ్యమంత్రి మా దేవుడు.. మా పంటలు పండుతాయి.. కడుపులు నిండుతాయి’ అంటూ ప్రజలు, రైతులు ఆనందంతో పరవశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, కలెక్టర్లు ఉదయ్కుమార్, రవినాయక్, తేజస్ నందలాల్పవార్, క్రాంతి, శ్రీహర్ష, నారాయణరెడ్డి, హరీశ్, ఇంజినీర్లు పాల్గొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వికారాబాద్ జిల్లా నుంచి 134 బస్సుల్లో సుమారు 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 266 ఆర్టీసీ బస్సుల్లో సుమారు 16 వేల మంది తరలివచ్చారు. వీరంతా కలశాల్లో కృష్ణానీటిని తీసుకొని, స్వస్థలాలకు తరలివెళ్లారు. ఆదివారం ప్రతి గ్రామంలో కృష్ణా జలాభిషేకం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ఏర్పాట్లు చేశారు. ఊరూరా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపులు నిర్వహించి గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లి దేవుళ్ల పాదాలకు జలాభిషేకం చేయనున్నారు.
నార్లాపూర్లో పాలమూరు ఎత్తిపోతల మోటర్ను ప్రారంభించి కృష్ణా జలాలకు పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
నాగర్కర్నూల్ జిల్లా నార్లాపూర్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కే కేశవరావు, రాములు, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వరెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, అరికెపూడి గాంధీ, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి తదితరులు
శనివారం కంప్యూటర్ ద్వారా నార్లాపూర్లో మోటర్ను ఆన్ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు
సీఎం కేసీఆర్ మోటర్ ఆన్ చేయడంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి పరుగులు తీస్తున్న కృష్ణా జలాలు
ఎత్తిపోతల పథకం ప్రారంభం అనంతరం నార్లాపూర్ ప్రాజెక్టు గురించి అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్