పాత కూలీలకూ కొత్త ఖాతాలు తెరవాలట
అడ్డంకిగా కొత్త గ్రామ పంచాయతీ కోడ్
జాబ్కార్డులో సరిదిద్దేందుకూ అవకాశం
పట్టించుకోని కేంద్రం.. కూలి జమలో తిరకాసు
రాష్ట్రంలో 2.36 లక్షల మంది బాధితులు
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చిత్రవిచిత్ర కొర్రీలు పెడుతున్నది. సాంకేతిక కారణాలను చూపించి పనిచేసిన కూలీకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నాలుగు వేల వరకు కొత్త గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రతి పంచాయతీలో ఉపాధిహామీ కూలీలు పనులు చేస్తున్నారు. వీరికి ఇచ్చే జాబ్ కార్డుల్లో పంచాయతీ కోడ్ ఉంటుంది. కొత్త గ్రామ పంచాయతీల్లోని కూలీల జాబ్ కార్డుల్లో పాత, కొత్త గ్రామ పంచాయతీల కోడ్లు ఉన్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లోని ఉపాధి కూలీలు కొత్త బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు వారి కూలీని బ్యాంకులో జమ చేయకుండా ఆపేసింది.
నిజానికి జాబ్ కార్డులో కేంద్రం ప్రభుత్వం పంచాయతీ కోడ్లను ఆప్డేట్ చేస్తే సమస్య తీరుతుంది. కానీ, ఏకంగా కొత్త అకౌంట్లనే ఓపెన్ చేయాలని కొర్రీలు పెడుతున్నది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో బ్యాంకు బ్రాంచీలు లేవు. ఇప్పటికే ఉన్న బ్యాంకులో మళ్లీ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకు అధికారులు ఒప్పుకోవడంలేదు. దీంతో కూలీలు పనులు వదిలేసుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఇబ్బందులు పడుతున్నవారు రాష్ట్రంలో ఏకంగా 2.36 లక్షల మంది ఉన్నారు. వీరందరు కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, వారి అకౌంట్ వివరాలు అప్డేట్ అయ్యేవరకు కూలి పని చేసినా ఆ డబ్బు జమ చేయటంలేదు. దీంతో కూలీలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.