హైదరాబాద్ : ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసంవిధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిందని మంత్రి గుర్తు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దీని అమలులో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్తలబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు.
వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత, గీత కార్మికులకు నెల నెలా ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని రూ. 200 నుంచి రూ.2,016 పెంచిందన్నారు. దివ్యాంగులకు ఇచ్చే ఫించను రూ. 500 నుంచి రూ. 3016కు పెంచిందని గుర్తు చేశారు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, బోదకాల బాధితులకు రూ. 2016 చొప్పున ఫించను అందిస్తున్నది.
2014 సంవత్సరంలో ఆసరా ఫించను లబ్దిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే. నేడు రాష్ట్రంలోఆసరా ఫించన్ల లబ్ధిదారుల సంఖ్య 38 లక్షల 41 వేలు. గడిచిన ఏడున్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం రూ. 46,650 కోట్లను నిరుపేదలకు ఇచ్చే ఆసరా పింఛన్ల కోసం ఖర్చు చేసింది. ఇది మా ప్రభుత్వం పేదలపట్ల ప్రదర్శిస్తున్న మానవీయ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11,728 కోట్లు ప్రతిపాదించడమైనదని హరీశ్రావు తెలిపారు.